ఆత్మకూరు, మే 21 : మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కాస్త హస్తం పార్టీ సభగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ చుట్టూ కాంగ్రెస్ నాయకులు చేరారు. కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామిరెడ్డి.. ఏదో పేపర్ చూపించి, చెవిలో గుసగుస చెప్పడంతో రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వద్దు వద్దు అని పదేపదే మందలించారు.
ముందుగా ఐదుగురు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించాలనుకున్నారు.. కానీ, అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడించలేదని గుసగుసలు వినిపించాయి. రచ్చబండ స్టేజీ చుట్టూ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి పావుగంట సేపు నాయకులు పక్కన ఉండాలని చెప్పినా ఖాతరు చేయలేదు. మీడియా మిత్రులకు సహకరించాలని విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. రేవంత్రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ నాయకులు తమ సమస్యలు చెప్పకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. రచ్చబండ కాంగ్రెస్ సభగానే ఉందని పలువురు వ్యాఖ్యానించడం కొసమెరుపు.