రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జనగామ ఎంసీహెచ్కు హఠాత్తుగా వచ్చి హడలెత్తించారు.. సాదాసీదాగా వచ్చిన మంత్రి ఇక్కడి సౌకర్యాలు, అందుతున్న సేవలను తెలుసుకొని వైద్యులపై సీరియస్ అయ్యారు. రోగులకు ఇచ్చే మందులతో పాటు గర్భిణులను స్కానింగ్ కోసం ప్రైవేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేయడంపై మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం హాస్పిటల్లోని అన్ని వార్డుల్లో కలియదిరిగి రోగులను ఆత్మీయంగా పలుకరించారు. గర్భిణులకు ఇక్కడే స్కానింగ్ చేయాలని.. వైద్యశాల బయట అనుమతి లేని మెడికల్ షాపులు, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.
జనగామ, మే 14 (నమస్తే తెలంగాణ) : జనగామ ఎంసీహెచ్(మాతా శిశు సంరక్షణ కేంద్రం)ను శనివారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేసి.. అక్కడి రోగులకు మందులు, స్కానింగ్ను ప్రైవేట్కు రిఫర్ చేసిన వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేటకు వెళ్తూ మార్గమధ్యలో జనగామకు వచ్చిన మంత్రి నేరుగా ఎంసీహెచ్ ప్రసూతి, శిశువార్డులలో ఉన్న పేషంట్ల వద్దకు వెళ్లారు. అక్కడ బాలింతలు, గర్భిణులు వారి బంధువులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు, వైద్యులు, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సాదాసీదాగా సామాన్యునిగా ఆస్పత్రి లోపలికి వచ్చిన మంత్రిని చూసి సిబ్బంది, పేషంట్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ తర్వాత ఆస్పత్రి మొత్తం కలియదిరిగి పేషంట్లను ఆత్మీయంగా పలుకరించారు. చేశారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? మందులు, అన్నం పెడుతున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అయితే దవాఖానలో సేవలు బాగున్నప్పటికీ కొన్ని లోపాలను గుర్తించిన మంత్రి హరీశ్రావు వెంటనే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడి ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురిటినొప్పులతో ఉన్న గర్భిణులకు స్కానింగ్ కోసం జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపడాన్ని తప్పుబట్టిన మంత్రి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఎంసీహెచ్లోనే స్కానింగ్ చేయాలని, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను పరిశీలించి అనుమతులు లేనివాటిని సీజ్ చేయాలని ఆదేశించారు.