పర్వతగిరి, మే 12: ఉపాధిహామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆయన ఈజీఎస్ పనులపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో 300 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ నెల 20న పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యం, తడి, పొడి సేకరణ, డంపింగ్ యార్డుల్లో వర్మీకంపోస్టు తయారీ, శ్మశాన వాటికలను వినియోగంలోకి తేవడం, రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించడం, ఉపాధిహామీ పనుల వంటి అంశాలపై చర్చించారు. వచ్చే హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమీక్షలో ఎంపీవో పాక శ్రీనివాస్, ఏపీవో సుశీల్కుమార్, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
జోరుగా ఉపాధిహామీ పనులు
నర్సంపేట రూరల్: గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జోరందుకున్నాయి. గురువారం ఇటుకాలపల్లి, నాగుర్లపల్లి, చిన్న గురిజాల, ముత్తోజిపేట, రాజుపేట, ఆకులతండా, భోజ్యానాయక్తండా, నర్సింగాపురం గ్రామా ల్లో ఉపాధి కూలీలు పనులు చేశారు. మాదన్నపేట, దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లిలో కూలీలు ఫీడర్ చానల్ పనులు చేశారు. ఈ పనులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని సర్పంచ్లు చంద్రమౌళి, శ్రీనివాస్, రంగారెడ్డి, పూలమ్మ, లావణ్య తెలిపారు. అనంతరం కూలీలకు పలు సూచనలు చేశారు. ఉపాధిహామీ పనులను జాబ్కార్డు ఉన్న వారు వినియోగించుకోవాలని సూచించారు.