కాజీపేట, ఏప్రిల్ 9: కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వారం రోజులుగా పనిచేయడంలేదు. దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి, ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా కాజీపేట రైల్వేస్టేషన్ ఉన్నందున కాజీపేట చౌరస్తా నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. కానీ కాజీపేట, ఫాతిమానగర్లలోని ప్రధాన చౌరస్తాల వద్ద సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలు వేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్, లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడా వాహన ఫొటోలు తీస్తారోనని సిగ్నల్ లేకపోవడంతో వాహనాలను వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీంతో ఏ వాహనం ఎటు వైపు వెళ్తుందో తెలియక పాదాచారులు నరకయాతన పడుతున్నారు.
నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే చౌరస్తాలో సిగ్నల్స్ పనిచేయకపోయినా ట్రాఫిక్ పోలీస్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేందంటూ వాహనదారులు, పాదాచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్, పోలీస్ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడంలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్కు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, పాదాచారులు, స్థానికులు కోరుతున్నారు.