నర్సంపేట, నవంబర్ 26: మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో 180 కిలో మీటర్ల మేర బీటీరోడ్ల నిర్మాణానికి రూ. 55 కోట్ల నిధుల అంచనాతో రెన్యువల్ చేస్తామన్నారు. ఆర్అండ్బీ విభాగంలో మొత్తం 125.20 కిలో మీటర్ల మేరకు బీటీరోడ్లను రూ. 67.95 లక్షల నిధులతో రెన్యువల్ చేశామన్నారు. ఎస్టీ సబ్ప్లాన్ కింద నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని తండాల్లో బీటీరోడ్ల ఏర్పాటుకు 74.70 కి.మీ. మేరకు రూ. 43.93 లక్షల నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నామని వివరించారు. టీఎస్ఎంఐడీసీ కింద ప్రభుత్వం బస్తీ దవాఖానలు, హెల్త్ సబ్ సెంటర్లు నిర్మిస్తున్నదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని 52 హెల్ సబ్ సెంటర్లకు కొన్ని నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో మొదటి విడుత 104 పాఠశాలల్లో రూ. 27 కోట్ల నిధులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా సీసీరోడ్లు నిర్మించాల్సిన గ్రామాల్లో అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సమీక్షలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైఎస్ ఎంపీపీలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, టీఎస్ ఎంఐడీసీ, ఐటీడీఏ, ఇంజినీర్లు పాల్గొన్నారు.