ఏటూరునాగారం, అక్టోబర్ 1: ఏజెన్సీలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఏటూరునాగారంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసిందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండల కేంద్రంలో రూ.7కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ సెంటర్ను మంత్రి శనివారం ప్రారంభించారు. వైద్యశాలలోని పలు విభాగాలను మంత్రితోపాటు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్, ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు.
ఈ వైద్యశాలను మూడు ఆపరేషన్ థియేటర్లతో ఏర్పాటు చేయడం అదృష్టమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ప్రారంభించినట్లు చెప్పారు. డయాలసిస్ రోగులకు దూర భారం తప్పనుందన్నారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రం కార్పొరేట్ వైద్యశాలకు మించి ఉందన్నారు. మంత్రి వైద్యశాలలోని విభాగాలన్నీ తిరిగి పరిశీలించారు. అందే వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ సురేశ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద ఎంత వచ్చినా ఇబ్బందులు కలుగకుండా తీరమంతా కరకట్ట నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నారని తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్స్టేషన్, మార్కెట్ యార్డులను అందుబాటులోకి వివరించారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్యే సీతక్క, ఐటీడీఏ పీవో అంకిత్, డీఎంహెచ్వో అప్పయ్య, వైద్య విధాన పరిషత్ కమిషనర్ జె. అజయ్కుమార్, అడిషనల్ హెల్త్డైరెక్టర్ అమర్సింగ్, డీసీహెచ్ఎస్ జగదీశ్, డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ విజయ, సర్పంచ్ రామ్మూర్తి, గిరిజన సంక్షేమశాఖ డీడీ పోచం, ఈఈ హేమలత పాల్గొన్నారు.