రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, అభివృద్ధితో మెరుస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా మొక్కలు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలతో పచ్చగా మారాయి. వైకుంఠధామం, నర్సరీ, చెత్త డంపింగ్ యార్డులు, సైడ్ కాల్వలు ఏర్పాటయ్యాయి. తారు, సీసీ రోడ్లు, వీధిలైట్లు వంటి సకల సౌకర్యాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పల్లె ప్రగతి నిధులతోపాటు ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో మానుకోట జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చింది. మూడేళ్లలో రూ.302.05కోట్లు విడుదల చేసింది. దీంతో మారుమూల తండాలు, గూడేలు సైతం మరింత అభివృద్ధితో కళకళలాడుతున్నాయి.
మహబూబాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మారుమూల పల్లెలు కూడా అభివృద్ధిబాట పట్టాయి. ‘తండాలు గ్రామ పంచాయతీలైతే ఏం ప్రయోజనం?’ అన్న నోర్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయి? ఒకప్పుడు మట్టి రోడ్లు కూడా సరిగా లేని తండాల్లో తారురోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చాయి. పచ్చని వనాలుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పచ్చదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చగా మారాయి. పల్లెలన్నీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు మనిషి మరణిస్తే వైకుంఠధామాలు లేక వాగులు, వంకల్లో అంత్యక్రియలు నిర్వహించేవారు.
వీటికి తోడు ఫైనాన్స్ కమిషన్ నిధులతో పల్లెలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు పల్లెప్రగతి ద్వారా వచ్చే నిధులతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. సాగు, తాగునీరు, విద్యుత్, ఇతర అన్ని సౌకర్యాలతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పల్లెలకు ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోనే మానుకోట జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మూడేళ్లలో రూ.302.05కోట్ల నిధులు వచ్చాయి. 2019-20 ఏడాది రూ.77.62కోట్లు, 2020-21లో రూ.123.16కోట్లు, 2021-22లో రూ.85.63కోట్లు, 2022 నుంచి ఏప్రిల్ 1 వరకు రూ.15.63కోట్ల నిధులు జిల్లాకు వచ్చాయి. ఈ నిధులతో పల్లెలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి.
జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏటా వచ్చే ఫైనాన్స్ నిధులతోపాటు జనరల్ ఫండ్స్, పల్లెప్రగతి నిధుల ద్వారా తండాలు, గూడేలు, గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, వీధి లైట్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చనిచెట్లు, పల్లె ప్రకృతి వనం, అందులో వాకింగ్ ట్రాక్, నర్సరీ, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెల్లో ఎక్కడ చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పోయడంతో గ్రామాలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయి.