హనుమకొండ చౌరస్తా, మే 25 : వరంగల్ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. పంచముఖ వీరాంజనేయస్వామికి 21 లీటర్ల ఆవు పాలు, 11 లీటర్ల తేనె, కిలో నెయ్యి, 9 కిలోల చక్కెర, సుగంధ ద్రవ్య పరిమళ లేపనంతో అభిషేకం, మహాపూర్ణాహుతి నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
చీఫ్ విప్ దాస్యం ఆంజనేయస్వామికి ఆకు పూజ నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా హనుమకొండ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, కాకతీయ రాజుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సంజీవరావు, రామకృష్ణ, చుక్కయ్య, రజిత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.