వరంగల్ చౌరస్తా, మే 24: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ విభాగంలో సుమారు రూ.2కోట్ల 14లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సీటీ స్కాన్ యంత్రాన్ని, బయోమెట్రిక్ విధానాన్ని ఆయన ప్రభుత్వ చీఫ్విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు.
యంత్రం పనితీరు, స్కానింగ్ సామర్థ్యం తదితర విషయాలను ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో మహానగరంగా ఉన్న వరంగల్ నగరాన్ని తెలంగాణ హెల్త్ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగానే రూ.1100కోట్లతో 24 అంతస్తుల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ను 18నెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయిని పెంచి, అవసరమైన మౌలిక వసతులు, యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వారు అన్నారు. అందులో భాగంగానే ఎంజీఎం సామర్థ్యాన్ని వెయ్యి నుంచి 1300 పడకల స్థాయికి పెంచిందని పేర్కొన్నారు. 100 ఐసీయూ బెడ్ల సంఖ్యను 180 పెంచడంతోపాటు వెంటిలేటర్స్ బెడ్స్ సంఖ్యను 25 నుంచి 200కు పెంచినట్లు తెలిపారు. అందుకు తగినట్లుగా సుమారు రూ.15లక్షల విలువైన ఎక్స్రే యంత్రాన్ని, రూ.40లక్షల వ్యయంతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
త్వరలోనే సుమారు రూ.12కోట్ల వ్యయంతో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.రెండు ఆక్సీజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో సుమారు రూ.కోటి విలువైన గుండె సంబంధిత స్టెంట్లను బాధితులకు అమర్చినట్లు వివరించారు. సూపర్స్పెషాలిటీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు 135 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునేందుకు చర్యలు చేపట్టారని, ఇప్పటివరకు 80మంది వైద్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన శానిటేషన్ లోపాలను దృష్టిలో ఉంచుకొని ఆ కాంట్రాక్టు సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసి, టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా గుర్తింపు ఉన్న వరంగల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత అభివృద్ధి పరుస్తూ మల్టీహబ్గా మార్చుతున్నారని వారు తెలిపారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించడంతోపాటు నగరంలో ఐటీ సంస్థలను ప్రోత్సహించడం, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారని వివరించారు.
ఇండస్ట్రియల్, ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి వాటిలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్దాస్, వరంగల్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంజీఎం ఆర్ఎంఓ మురళి, ప్రసాద్, ఎంజీఎం దవాఖానలోని విభాగాధిపతులు, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.