సుబేదారి, మే 18: ఎడ్యుకేషన్ అకాడమీ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గంజాయి స్మోకర్ చెప్పిన వివరాలతో ముఠాను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ తరుణ్జోషి నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. హనుమకొండకు చెందిన నరెడ్ల రమేశ్, దేవరాజు సుధాకర్, దాస భిక్షమయ్య వేర్వేరుగా ఎడ్యుకేషన్ అకాడమీలు ఏర్పాటు చేసుకున్నారు.
యువకుల అవసరాలను ఆసరాగా చేసుకుని పరీక్షలు రాయకుండానే ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, చార్టెర్డ్ అకౌంటెంట్ చదివినట్లు రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షలు తీసుకుని నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి ఇచ్చేవారు. దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందడానికి మార్కుల శాతాన్ని పెంచేవారు. ఢిల్లీలోని ఐఐఈ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్లోని స్వామి వివేకానంద, వైజాగ్లో గీతం, హిమాచల్ప్రదేశ్లోని మహాత్మాగాంధీ, కాశీలో విద్యపత్, మహారాష్ట్రలోని ఐఐఐఈ, యూపీ, గుజరాత్, పంజాబ్, సిక్కిం, జార్ఖండ్, ఏపీ రాష్ర్టాల్లోని 30కిపైగా యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించేవారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఎడ్యుకేషన్ అకాడమీలపై దాడలు చేశారు. 153 నకిలీ సర్టిఫికెట్లు, సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ముఠాను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులను సీపీ తరుణ్జోషి అభినందించారు. కేసులో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్గైక్వాడ్, సీఐలు శ్రీనివాస్జీ, సంతోష్, ఎస్సై లవన్కుమార్, ఏఎస్సై సల్మాన్పాషా, హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేశ్, అలీ, భిక్షపతి, శ్రీను, రాజు, శ్రావణ్, హోంగార్డు విజయ్ని సీపీ అభినందించారు.
నగరంలో ఇటీవల గంజాయి స్మోకర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి చదువు వివరాలను ఆరా తీసి, సర్టిఫికెట్లను పరిశీలించారు. హనుమకొండ గోపాల్పూర్కు చెందిన నకిలీ సర్టిఫికెట్ల తయారీ నిందితుడు నారెడ్ల రమేశ్ కేయూ రోడ్డులో దుర్గా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అతడి నుంచి రూ.రెండున్నర లక్షలతో నకిలీ సర్టిఫికెట్ తీసుకున్నట్లు గంజాయి స్మోకర్ పోలీసులకు చెప్పాడు, టాస్క్ఫోర్స్ పోలీసులు రమేశ్ను ఆదుపులోకి తీసుకుని విచారించారు.
నయీంనగర్లో డీఎస్ఆర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న దేవరాజు సుధాకర్, ఎక్సైజ్కాలనీకి చెందిన గుప్త కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న దాస భిక్షమయ్య నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. ఆయా కన్సల్టెన్సీ ఆఫీస్ల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.