పల్లెలు ప్రగతిపథంలో పయనించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమం ములుగు జిల్లాలో మెరుగైన ఫలితాలనిస్తోంది. ప్రతిపల్లెలో పల్లెప్రకృతి వనాలతో పాటు స్మశానవాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమ ఉద్దేశం. పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు నీరు పట్టేందుకు జిల్లాలోని 169 జీపీలు ట్రాక్టర్లు కొనుగోలు చేశాయి. ఈ మొక్కలు ఏపుగాపెరిగేందుకు సెగ్రిగేషన్ షెడ్లో తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును వాడుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఇతర వస్తువులను విక్రయించడం ద్వారా గ్రామపంచాయతీకి అదనపు ఆదాయం వస్తున్నది. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా పోయాయి.
ములుగు, మే 18 (నమస్తేతెలంగాణ) : గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ములుగు జిల్లాలో మెరుగైన ఫలితాలనిస్తోంది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉండగా, అన్ని జీపీలకు ట్రాక్టర్లు, ట్యాం కర్లు, ట్రాలీలను కొనుగోలు చేయగా, 169 జీపీలకు చెందిన ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీల ఖరీదు డబ్బులను బాకీ లేకుండా చెల్లించారు. మిగిలిన ఐదు జీపీల్లోనూ త్వరలో చెల్లించేందుకు అధికారులు నిధులను సమీకరిస్తున్నారు. జిల్లాలోని మేడారం, పస్రా, ఏటూరునాగారం, జీపీల్లో రెండు ట్రాక్టర్ల చొప్పున కొనుగోలు చేశారు.
ములుగు జిల్లాలో మూడు ట్రాక్టర్లను ఖరీదు చేశారు. అదేవిధంగా వెంకటాపురం(నూగూరు), కమలాపురం జీపీల్లో మరో ట్రాక్టర్ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ములుగుతోపాటు ఏటూరునాగారం జీపీలకు జేసీబీలను కొనుగోలు చేశారు. అన్ని జీపీల్లో పల్లెప్రకృతి వనాలతో పాటు స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రతి జీపీలో స్మశాన వాటికను ఏర్పాటు చేయడంతో ప్రజలు గతంలో లాగా ఇబ్బందులు పడకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని జీపీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలకు సెగ్రిగేషన్ షెడ్లో తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి ప్లాస్టిక్ ఇతర సామగ్రి విక్రయాల ద్వారా అదనపు అదాయాన్ని పొందుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 174 జీపీల్లో 250 కిలో మీటర్ల మేర 1,12,438 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. వీటితో పాటు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి అన్ని జీపీల్లో 7,93,938 మొక్కలు నాటగా 7,89, 150 మొక్కలను సంరక్షించారు. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు లూజ్ వైర్లను సరిచేసి మిడిల్ పోల్స్ ఏర్పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నారు.
పల్లెప్రగతిలో భాగంగా గ్రామపంచాయతీలతో పాటు ఆమ్లెట్ గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను నిర్మించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మినీ బృహత్పల్లె ప్రకృతి వనాలను సైతం నిర్మించేందుకు సన్నద్ధమవుతు న్నారు. ప్రభుత్వ స్థలం దొరకని గ్రామాలతో పాటు ఆమ్లెట్ గ్రామాల్లో ఊరికి దూరంగా నిర్మించడంతో ప్రజలు వాటిని వినియోగించడం లేదు. పీపీవీలలో ఎక్కువ శాతం అలంకరణ మొక్కలు, పూల మొక్కలను నాటి నీడనిచ్చే మొక్కలను నాటకపోవడంతో ప్రజలు వాటిని సందర్శించడం లేదు.
వాకింగ్ ట్రాక్లు లేకపో వడంతో ప్రజలు వినియోగించడం లేదు. ఇప్పటికైనా పీపీవీలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. స్మశాన వాటికను సైతం ఊరికి దూరం గా నిర్మించడంతో ఇబ్బందులు తల్తెత్తుతున్నాయి. ప్రతి జీపీకి సమీపంలో వైకుంఠరథాన్ని మంజూరు చేయాల్సి ఉంది. అదేవిధంగా వేసవికాలంలో అక్కడక్కడ నీటి ఎద్దడి కారణంగా ట్రాక్టర్తో పీపీవీలలోని మొక్కలకు సరిగా నీరు అందడం లేదు. దీన్ని అధిగమించేందుకు ప్రతి పీపీవీ వద్ద బోరు ఏర్పాటు చేసి డ్రిప్ సిస్టమ్ను అమర్చాలి.