స్టేషన్ ఘన్పూర్, జూలై 1 : ‘మీ పిల్లలను బడిలో చేర్పించండి.. నేను అండగా ఉన్నా’ అంటూ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి బైక్పై విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. చిల్పూరు మండలం గార్లగడ్డ తండా శివారు కచ్చర్ల తండాలోని ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలకు 317 జీవో బదిలీలో భాగంగా ధరావత్ చంద్రం అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండగా, 17 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యను పెంచాలనుకున్నాడు.
ఈ నేపథ్యంలో చంద్రం తోటి ఉపాధ్యాయుడు లక్ష్మణ్తో కలిసి ఇంటింటా తిరిగి విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశాడు. ఈ క్రమంలో బడి ఈడు పిల్లలు పాఠశాలకు రాకుండా ఉండడం, కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు పిల్లలను వదిలి కూలి పనులకు వెళ్లడాన్ని గమనించాడు. ‘ఒకరోజు పిల్లల తల్లిదండ్రులను కలిసి మీ పిల్లలను బడిలో చేర్పించండి.
నేను ఉన్నా, నా బండిపై పిల్లలను బడికి తీసుకపోయి, తీసుకొస్తానని హామీ ఇచ్చి పాఠశాలలో చేర్పించాడు. ప్రతిరోజూ ఐదుగురు విద్యార్థులను ఉదయం బడికి తీసుకొచ్చి, సాయంత్రం ఇంటివద్ద తోలుతున్నాడు. కచ్చర్ల తండాతోపాటు, పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉన్న దేవుల తండాకు చెందిన పిల్లలను బైక్పై పాఠశాలకు చంద్రం తీసుకొస్తుండడంతో స్థానికులు అభినందిస్తున్నారు.