మహబూబాబాద్, జూన్30 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్లో జరిగిన బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్నాయక్ ఏ మాత్రం సంస్కారం లేకుండా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.. వెంటనే అతడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గురువారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పాలనను దేశమే అభినందిస్తుంటే కమలం పార్టీ నాయకులకు కనిపించడం లేదా.., లేక కళ్లు లేవా అని ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, మీ పార్టీ ప్రముఖులు చేసిన అభినందనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది మీ మొహం మీదేపడి కలుషితం చేస్తుందన్నారు. తెలంగాణకు ఈ సమంత న్యాయం చేయని కేంద్రప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించడం ద్వారానే నాయకులైపోదామని కలలు కంటున్నారని, మీ ఆటలు ఇక్కడ సాగవన్నారు. దిగజారిపోయి పచ్చి బూతులు మాట్లాడుతున్న మీ తీరు మార్చుకోకుంటే తెలంగాణ బిడ్డలు తరిమికొడుతారన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, హుస్సేన్నాయక్ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడు.. అని కవిత హెచ్చరించారు.