వర్ధన్నపేట, జూన్ 30: పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వస్తువులను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ హెచ్చరించారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై గురువారం వర్ధన్నపేటలో మున్సిపల్ పాలకమండలి, అధికారులు, సిబ్బంది పట్టణంలోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నదన్నారు.
ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కరిగిపోకపోవడం వల్ల భూసారం దెబ్బతింటున్నదని వివరించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీలో వేయ డం వల్ల మురికినీరు మరింత ప్రమాదకరంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు రవీందర్, రాజమణి, రామకృష్ణ, కొండేటి అనిత, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/వరంగల్చౌరస్తా: ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతున్నదని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అన్నారు. 36వ డివిజన్ పరిధిలో శానిటరీ సూపర్వైజర్ సంపత్రెడ్డి ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, బల్దియా ఎంహెచ్వో రాజిరెడ్డి మాట్లాడుతూ కిరాణా షాపులు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్కు బదులు పేపర్, బట్ట, జ్యూట్ బ్యాగులు, మట్టి, పింగాణి, స్టీల్, గాజు, చెక్కతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నిషేధాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సయ్యద్ మసూద్, శ్రీనివాస్, యాకయ్య, రమేశ్, మధు, చిన్నా పాల్గొన్నారు. వరంగల్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్, బుడిగజంగాల కాలనీలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ బోగి సువర్ణా సురేష్, గిరిప్రసాద్నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, ఫేరోజ్, రవి, భిక్షపతి, సలావుద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ నిరంజన్, జవాన్లు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గలో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజీరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సాంబయ్య, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన పారిశుధ్య కార్మికురాలు వాంకర్ రాజమణిని కార్పొరేటర్తోపాటు లక్ష్మిగణపతి పరపతి సంఘం సభ్యులు సన్మానించారు.