మత సామరస్యానికి ప్రతీకగా, హిందూ ముస్లింలు కలిసి జరుపుకొనే మొహర్రం వేడుకలు పల్లెల్లో అత్యంత భక్తి ప్రపత్తులతో సాగుతున్నాయి. ప్రధాన కూడళ్లలోని పీరీల మసీదుల(ఆశూర్ఖాన)లో సవార్లు కొలువుదీరగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముజావర్లు ప్రతీరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు సవార్లకు పూలు, ఊదు, బెల్లం, దట్టీలు సమర్పించుకుంటూ మొక్కులు చెల్లిస్తుండడంతో అంతటా సందడి నెలకొంటున్నది. తొమ్మిది రోజుల పాటు సవార్(పీరమ్మ)లను కొలిచి పదో రోజు (ఈ నెల 9న) నీటిలో నిమజ్జనం చేసి వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తారు.
మొహర్రం వేడుకల్ని హిందూ ముస్లింలు సోదరభావంతో కలసిమెలసి జరుపుకొంటారు. పీరీల ఊరేగింపు సందర్భంగా తొమ్మిది రోజులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. అన్ని గ్రామాల్లో సవార్లను ప్రతిష్ఠించారు. మొదటి ఐదు రోజులు సవార్లను కొట్టాల్లోనే ఉంచగా ముజావర్లు(సాహెబ్) ప్రతి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 6వ రోజు నుంచి 9వ రోజు వరకు సవార్లను గ్రామంలో ఇంటింటికీ మొక్కుల కోసం తిప్పుతారు. 9వ రోజున ఉదయం పెద్ద ఎత్తున పాలతో మట్కీలను తయారు చేసి అగ్నిగుండం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి యాటపోతు కందూర్లు నిర్వహిస్తారు. అలావా(గుంత) ఏర్పాటుచేసి కట్టెలతో నిప్పు తయారు చేస్తారు. ప్రతీ రోజు నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ అసైదుల్లా హారతి అంటూ ఆడుతారు. పీరీలను రోజు ఉదయం, సాయంత్రం గ్రామ వీధుల్లో ఊరేగించి, భక్తులిచ్చే కానుకలు స్వీకరిస్తారు. మొహర్రం సందర్భంగా పది రోజుల పాటు గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఆ తర్వాత పదో రోజు అర్ధరాత్రి వరకు ఊరేగించి సవార్లను నీటిలో నిమజ్జనం చేస్తారు. పీరమ్మలకు భక్తులు కుడుకలు, బెల్లం, ఊదు, తొట్టె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇస్లామిక్ మత పరిరక్షణ కోసం జరిగిన అతి పవిత్ర యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమలు హజ్రత్ ఇమాం హుస్సేన్, హస్సేన్లు ఈ మాసంలోని 10వ రోజున వీరమరణం పొందారు. వీరి త్యాగనిరతిని స్మరిస్తూ పది రోజుల పాటు సంతాప సూచకంగా మొహర్రం జరుపుకొంటారు. అప్పటి రాజు అమీర్ మౌలానా కుమారుడు యాజిద్కు వారసత్వంగా రాజ్యాధికారాన్ని అప్పజెప్పడాన్ని ప్రవక్త మనుమలు హుస్సేన్, హస్సేన్లు వ్యతిరేకిస్తారు. దీంతో యాజిద్ సైన్యం వీరిద్దరిని హతమార్చేందుకు పన్నాగం పన్నుతుంది.
తుదకు నమాజ్ చేస్తున్న వీరిపై దాడి చేస్తారు. వీరిద్దరితో పాటు ఆ యుద్ధంలో రక్త సంబంధీకులు చాలామంది చనిపోతారు. వెదురు బొంగులకు తలలను పెట్టి అపహస్యం చేస్తూ ఊరేగించారనేది జన ప్రతీతి. అందుకే ప్రతీ సంవత్సరం వీరి త్యాగాన్ని స్మరిస్తూ మొహర్రంను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. నెలవంకను చూసి ఈ పండుగను జరుపుకోవడం మొదలుపెడుతారు. పీరమ్మల కొట్టంలో పెట్టెలో దాచి ఉంచిన సవార్లను నెలవంక వచ్చిన రోజు తీసి శుభ్రం చేసి వెదురు బొంగులకు అమర్చి అలంకరిస్తారు. ఇవి అలంకరించేందుకే రెండు రోజులు పడుతుంది. ఆ తర్వాత అశూర్ఖానాలను(కొట్టెం) శుభ్రం చేసి పీరీలను నిలబెడుతారు.