కరీమాబాద్/హన్మకొండ/న్యూశాయంపేట/పోచమ్మమైదాన్/ నర్సంపేట, మే11: దళితరత్న, తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యుడు బొమ్మల్ల కట్టయ్య (75)మంగళవారం దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నగరంలోని కరీమాబాద్కు చెందిన కట్టయ్య రైల్వేలో హెడ్ క్లర్క్గా పని చేసి 2016లో ఉద్యోగవిరమణ పొందారు. 2001లో అఖిల భారత దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారు అంబేద్కర్ ఫెల్లోషిప్, 2003లో ప్రభుత్వం దళితరత్న అవార్డు అందజేసింది. 2006లో కాకతీయ యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా నియమితులయ్యారు. ఇవే గాక ఈయన అనేక అవార్డులు, సత్కారాలు పొందారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా సైతం పని చేశారు.
యువతను సన్మార్గంలో నడిపిన మహానుభావుడు: మంత్రి ఎర్రబెల్లి
బొమ్మల్ల కట్టయ్య మృతికి పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు. అంబేద్కర్ జీవిత ఆశయాలను సమాజానికి తెలియజేస్తూ యువతను సన్మార్గంలో నడిపిన మహానుభావుడు కట్టయ్య అని గుర్తుచేసుకున్నారు. కట్టయ్య మృతి వరంగల్ ప్రజలకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం : బొమ్మల్ల కట్టయ్య మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, కాళోజీ ఫౌండేషన్ వరంగల్ ప్రతినిధులు, కార్పొరేటర్ పల్లం పద్మ, మాజీ కార్పొరేటర్ మేడిది రజిత, నాగపురి కల్పన, వివిధ సంఘాల నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.