ధర్మసాగర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్రంలో రుచికరమైన చేపలు లభించేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100 శాతం రాయితీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్లో సుమారు 12 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ధర్మసాగర్ చెరువు రిజర్వాయర్ లా కాకుండా పర్యాటక కేంద్రంగా చేపల రకాలను బట్టి ఏ చేపలను ఏ నిష్పత్తిలో విడుదల చేయాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య పిల్లల పెంపకానికి కృషి చేస్తానని, మత్స్యకార జాతి బిడ్డగా మత్స్యకారులు జీవితాలు బాగుపడేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మత్స్యకారులు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని, పిల్లలలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని సూచించారు. విద్యతోనే మంచి స్థాయికి చేరుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో
రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా బొర్ర జ్ఞానేశ్వర్,రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మత్స శాఖ సంచాలకులు నిఖిల, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తహశీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.