ఖానాపురం, డిసెంబర్ 4: పద్దెనిమిదేళ్లు నిండి ఓటరుగా పేర్లు నమోదు కాని యువతీ యువకులు ప్రత్యేక నమోదు కేంద్రాలను వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ కోట సూచించారు. మండలకేంద్రంలోని 93, 94, 97, 98, 99 పోలింగ్ బూత్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఓటరు నమోదు ప్రక్రియను ఏవిధంగా చేపడుతున్నారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరూ ఓటుహక్కు పొందేందుకు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
రాయపర్తి/నర్సంపేటరూరల్: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలవ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ వరకు మండల రెవెన్యూ శాఖ నిర్వహణలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మండలంలో 18 ఏళ్లు నిండిని వయోజనులంతా వినియోగించుకోవాలని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ కోరారు. డీటీ ధరావత్ సూర్యానాయక్తో కలిసి మండలంలోని రాయపర్తి, తిర్మలాయపల్లి, గన్నారం, కొండూరు, బురహాన్పల్లి, కాట్రపల్లి, మొరిపిరాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బూత్స్థాయి అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు కేంద్రాలను వారు ఆకస్మికంగా సందర్శించారు.
ఓటరు నమోదుతోపాటు గ్రామాల్లో మృతి చెందిన వారి వివరాలను బూత్స్థాయి అధికారులకు అందజేసి ఓటరు జాబితా నుంచి తొలగింపజేయాలని కోరారు. అంగవైకల్యం ఉన్న ఓటర్ల వివరాలను జాబితాలో మార్కింగ్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్ఏ మహంకాళి యాకయ్య పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు నూతన ఓటర్లకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. మహేశ్వరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, లక్నేపల్లి, రాజుపేట, ఆకులతండాలో నూతన ఓటర్ల నుంచి ఆర్ఐ రజాక్, డీటీ ఉమారాణి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్కుమార్రెడ్డి, బూత్లెవల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: ఓటుహక్కు వినియోగంపై సోమవారం మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ దూలం మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. మేడెపల్లిలోని రైతు వేదికలో నూతన ఓటర్ల నమోదుతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తహసీల్దార్ కోరారు.