కరీమాబాద్/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/ఖిలావరంగల్, జూలై 25 : భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. మంగళవారం మేయర్ గుండు సుధారాణి, సీపీ రంగనాథ్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని పలు ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కార్పొరేటర్లు సిద్దం రాజు, పోశాల పద్మ, మరుపల్ల రవి, పార్టీ 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్కుమార్ ఉన్నారు. అలాగే, కాశీబుగ్గలోని వివేకానందకాలనీ, చిన్నవడ్డేపల్లి చెరువు, శాంతినగర్, పద్మనగర్ను కూడా ఎమ్మెల్యే సందర్శించారు. ఇండ్లు నీటిలో మునిగిన వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ బోనాల కిషన్, కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే, గ్రేటర్ 22వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది.
బ్యాంకు కాలనీ, మర్రి వెంకటయ్య కాలనీ, విశ్వనాథపురి ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీటితో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఈ ప్రాంతాలను కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి స్థానిక సమస్యలను వారికి వివరించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, 13వ డివిజన్ చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాల్లో కూడా వారు పర్యటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వర్షంలో తడుచుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఖిలావరంగల్లోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే నరేందర్ పరిశీలించారు. మైసయ్యనగర్ను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని పలు ముంపు ప్రాంతాలను మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ పీ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్తో కలిసి మైసయ్యనగర్ను సందర్శించారు. భారీ వర్షం కారణంగా వరదతో పలు ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులకు భోజన వసతులను ఏర్పాటు చేశారు. అనంతరం కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్తో కలిసి బాధితులకు భోజనం అందచేశారు. వరంగల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.