వర్ధన్నపేట, జనవరి 8 : వరంగల్-ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ సదన్కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల సమీపంలో చైన్స్నాచింగ్ ఘటనలు జరుగకుండా రహదారులపై విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైన్లు వెంటనే చెల్లించాలని, చలాన్లు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, యువకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై రామరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి : మద్యం తాగి వాహనాలను నడుపొద్దని దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్ సూచించారు. మండలంలోని వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిలో గిర్నిబావి వద్ద వాహనాల తనిఖీ చేశారు. అనుమానితులను ఆపి విచారించారు. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన దారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించి జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎస్సై వంగల నవీన్కుమార్, సిబ్బంది శేఖర్, ఐలయ్య, కిరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని నర్సంపేట టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్ అన్నారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. పత్రాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాల యజమానులకు జరిమానా విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. తనిఖీల్లో టౌన్ ఎస్సై బొజ్జ రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.