నడికూడ, అక్టోబర్ 24: దసరా పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అత్తగారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు నార్లాపూర్ చెక్ డ్యామ్లో ఈతకు కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు. పరకాల సీఐ జూపల్లి వెంకటరత్నం, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రేగొండ మండలం పెద్దంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన దొపతి సమ్మిరెడ్డి కుమారులు దొపతి జగన్రెడ్డి (33), దొపతి మల్లారెడ్డి(31) మండలంలోని వరికోల్కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారితో గతంలో వివాహం జరిగింది. ఒకరు హైదరాబాద్, మరొకరు చెన్నైలో సాఫ్ట్వేర్, బ్యాంకు మేనేజర్గా ఉద్యోగాలు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ కోసం వరికోల్కు చేరుకున్నారు.
కాగా, సోమవారం దసరా పండుగ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి పక్క గ్రామం నార్లాపూర్లో ఉన్న చెక్డ్యామ్ వద్దకు వెళ్లారు. తమ పిల్లలతో ఆడుకుంటూ గడిపారు. అనంతరం వాగులో సరదాగా ఈత కోసం వెళ్లి లోతు తెలియక నీళ్లలో ప్రమాదవశాత్తు పడి చనిపోయారు. మృతులిద్దరికీ ఇద్దరు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీఐ వెంకటరత్నం, ఎస్సై శివకృష్ణ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించారు.