హనుమకొండ చౌరస్తా, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీ-9 పేరుతో కొత్తగా టికెట్ తీసుకొచ్చింది. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నెల 18 నుంచి వరంగల్ రీజియన్ పరిధిలో టీ-9 టికెట్ అందుబాటులోకి వచ్చింది.
పల్లె వెలుగు బస్సుల్లోని కండక్టర్ల వద్ద టీ-9 టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మహిళలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు మాత్రమే వినియోగించుకోవడానికి అర్హులు. వృద్ధులు వయస్సు ధ్రువీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. రూ.100 చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. రావడానికి, పోవడానికి ఒకసారి మాత్రమే వినియోగించాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజూ లక్షలాది మంది పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం టీ-9 టికెట్ను ప్రారంభించింది. వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణించే ఉపాధ్యాయులు, ఉద్యోగినులు ఒక్కొక్కరికి రోజుకు రానుపోను రూ.150 వరకు ఛార్జీలు అవుతున్నాయి. టీ-9 టికెట్ అందుబాటులోకి రావడంతో వారికి ప్రయాణ ఖర్చు తగ్గనుంది. ఈ టికెట్తో ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతోంది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 430 పల్లెవెలుగు సర్వీసులు తిరుగుతున్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అనేక ఆఫర్లతో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో 430 పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చాం. మహిళలు, సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక భారం తగ్గించేందుకు తీసుకువచ్చిన ఈ టికెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. ఆర్టీసీ అందిస్తున్న ఆఫర్లను వినియోగించుకుని సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలి.
-ఆర్టీసీ ఆర్ఎం కే శ్రీలత