మహబూబాబాద్, జూన్ 30 : తెలంగాణలో చరిత్రాత్మకంగా జరుగుతున్న పోడు పట్టాల పంపిణీని గిరిజనులు పండుగలా జరుపుకుంటున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన పైలాన్, వెజ్, నాన్వెజ్, ఫ్రూట్స్, పూల మార్కెట్ను మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రామచంద్రాపురం కాలనీలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో 15వేల మందితో నిర్వహించిన సభలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ… నా అభిమాన నాయకుడు, నా హీరో మంత్రి కేటీఆర్ అని, రాష్ర్టానికి ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధిని చూపించారని కొనియాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసి తెలంగాణ చిత్రపటాన్ని సీఎం కేసీఆర్ ప్రపంచ చిత్రపటంలో నిలిపారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 67,730 ఎకరాల పోడు భూమిని సుమారు 25 వేలకు మందికి, అదే విధంగా రాష్ట్రంలో 4,06,639 ఎకరాల భూమిని 1,51,146మందికి అందించనున్నట్లు తెలిపారు. పోడు భూములకు హక్కుపత్రాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్పర్సన్గా ఉండడం తన అదృష్టమని, జన్మ ధన్యమైందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ మనస్సులో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే కలెక్టరేట్ను ప్రారంభించడానికి వచ్చిన సమయంలో మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50కోట్లు, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున, జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున.., మొత్తం రూ.171.10 కోట్లు మంజూరు చేశారని అన్నారు.
అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ మహబూబాబాద్లో అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తర్వాత ఎక్కువ అటవీ ప్రాంతం ఇక్కడే ఉందని, అటవీ భూములను నమ్ముకొని జీవిస్తున్న పోడు రైతులకు సీఎం కేసీఆర్ హక్కుపత్రాలివ్వడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ… మానుకోట జిల్లా ప్రజలు సీఎం కేఆసీర్, మంత్రి కేటీఆర్ రుణం తీర్చుకోవాలని సూచించారు. పోడు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిస్తుంటే, అక్రమంగా ఆక్రమించుకున్న రైతులను రెచ్చగొట్టి పట్టాలివ్వరని కాంగ్రెస్ విషప్రచారం చేస్తున్నదని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దన్నారు. 67 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదేళ్లుగా కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలో కరెంట్ లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారని, నేడు ఇండ్లకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. జీపీలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో గిరిజనులకు తమ తండాలను తామే పాలించుకునే అవకాశం దక్కిందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ చేసే విష ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరు చేసి మానుకోటపై ఉన్న మక్కువను కేసీఆర్ చాటుకున్నారని, అందుకు ప్రజలు కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ… ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో 2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోడు రైతులకు పట్టాలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, నేడు ఆచరణ సాధ్యం చేశారని తెలిపారు. పట్టాలు, రైతుబంధుతో గిరిజనులకు డబుల్ ధమాకా ఇచ్చారని అన్నారు.
75 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలోనే సాధ్యం చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ సేవాలాల్ మహరాజ్లా నిలుస్తారని చెప్పారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.5 కోట్ల అభివృద్ధి పనులు కావాలని అడిగితే దిక్కు దశ లేదన్నారు. నేడు సీఎం కేసీఆర్ అడగకుండానే మానుకోటకు దాదాపుగా రూ.వెయ్యి కోట్లిచ్చి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ కాలేజీలు ఇచ్చి క్లాసులు సైతం ప్రారంభించినట్లు చెప్పారు. గత పాలకులు గిరిజనులను ఓటర్లుగా చూశారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజనులకే పాలించుకునే అవకాశం కల్పించిన కేసీఆర్ను దేవుడిలా పూజించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సీఎం కేసీఆర్ పక్షాన నిలబడి మరోమారు సీఎం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో మానుకోట అభివృద్ధి చెందుతున్నదని, అడిగిన ప్రతిసారి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. 6 శాతం ఉన్న 10 శాతానికి పెంచి గిరిజనుల పాలిట దేవుడిగా సీఎం నిలిచారన్నారు. కేసముద్రంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఇనుగుర్తిని మండలం చేశారని, కేసముద్రం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసి ఫైర్ స్టేషన్ను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజ్ సారయ్య, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు బిందు, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, హరిప్రియానాయక్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కలెక్టర్ కే శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ఎస్పీ శరత్చంద్ర పవార్, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీధర్, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారి అంకిత్, జడ్పీటీసీలు మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, గుగులోత్ సుచిత్ర, బండి వెంకట్రెడ్డి, మంగళంపల్లి శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, గుడిపూడి నవీన్రావు, భరత్కుమార్రెడ్డి, పర్కాల శ్రీనివాస్రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, రైతు కో ఆర్డినేటర్ బాలాజీనాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బయ్యారం, జూన్ 30 : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సాంస్కృతిక సారధికి చెందిన 20 మంది కళాకారులు మూడు గంటల పాటు తమ ఆటాపాటతో సభికులను అలరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. వాటి ప్రాముఖ్యత, సీఎం కేసీఆర్ పాలన, నాడు ఉమ్మడి రాష్ట్రంలో రైతుల స్థితిగతులు.. నేడు రైతుల పరిస్థితి వంటివి ప్రజలకు పాటల ద్వారా వివరించారు. ముఖ్యంగా ‘వీరులారా.. వీర వనితల్లారా.., రైతు రాజయ్యే రోజు చేరువాయే.., పల్లెలకు వచ్చే పథకాలెన్నో’ వంటి పాటలు సభలో ఉర్రూతలూగించాయి. అంతేకాకుండా కళా బృందం సభ్యుడు రమేశ్ బంజారా భాషలో పాటలు పాడడంతో గిరిజనులు కేరింతలు కొట్టారు. మంత్రి కేటీఆర్ స్టేజీ వద్దకు చేరుకొన్న తర్వాత తొలుత ఇటీవల మృతి చెందిన సాయిచంద్తో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాకారులు సత్యనారాయణ, ఐలేశ్, భరత్కుమార్, బండా వెంకన్న, యుగేంధర్, రాజమౌళి, అశ్విని, నవీందర్, కొమెర వెంకన్న, పరమేశ్, కీర్తి, కవిత, రవి, రమేశ్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్, జూన్ 30 : సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ శివారులో మంచి ఆహ్లాదకర వాతావరణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టి ఇచ్చారు. ఇంటిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మా లాంటి పేద వాళ్లకు కేసీఆర్ ఎంతో సహకారం అందిస్తుండ్రు. ఆయనకు ఎల్లవేళలా అండగా నిలబడతాం.
– షేక్ జైబులు, బేతోలు గ్రామం
మహబూబాబాద్ రూరల్, జూన్ 30 : ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరింది. ఇన్నాళ్లూ కిరాయి ఇంట్లో ఇరుకు గదుల్లో పిల్లలతో అనేక ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ వల్ల వంట గది, రెండు బెడ్ రూమ్లతో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇంతకు ముందు ఏ పాలకులకు ఈ ఆలోచన రాలే. ఇది కేసీఆర్ వల్లే సాధ్యం అయింది. రాష్ట్రంలో కేసీఆర్ పేదలకు అండగా నిలబడి అన్ని వసతులను కల్పిస్తుండ్రు.
-మహ్మద్ ఖాసీం, 31వ వార్డు
మహబూబాబాద్ రూరల్, జూన్ 30 : గిరిజనుల ఆరాధ్యదైవం సీఎం కేసీఆర్. ఎన్నో సంవత్సరాల పోడు హక్కుదారుల కలను కేసీఆర్ సాకారం చేసిండు. గతంలో ఏ పాలకుల దృష్టికి తీసుకుపోయినా హక్కుదారు పత్రాలు రాలే. ఇప్పుడు ప్రజా నాయకుడు కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించిండు. హక్కు పత్రాలు రావడంతో ధైర్యంగా సాగు చేసుకొనే అవకాశం కలిగింది.
-గుగులోత్ రామచంద్రు, గౌరారం
మహబూబాబాద్ రూరల్ : సీఎం కేసీఆర్తోనే ఎంతో మంది పేదలకు లబ్ధి జరుగుతున్నది. పేదవాళ్లను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిండ్రు. అనేక సంవత్సరాల నుంచి ఇరుకు గదుల్లో కిరాయికి ఉం టూ అనేక ఇబ్బందులు పడ్డాం. గతంలో ఎన్నో పార్టీల నాయకులను చూశాం. తమ స్వలాభం కోసం ఆలోచన చేసేవారే గాని పేదల గురించి పట్టించుకోలే. కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది.
– దాసరి స్వామిదాసు, గాంధీపురం