జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ రోడ్డు, కాటారం రోడ్డు పొడవునా మేడారం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు జంగిల్ కటింగ్, సైడ్బర్మ్, మెయింటెనెన్స్ పనులను ప్రారంభించారు. మొత్తం 75 కిలోమీటర్ల పొడవునా రూ.15లక్షలతో చేపట్టిన ఈ పనుల్లో చెట్లను తొలగిస్తున్నారు. కాటారం రోడ్డు పొడవునా మేడారం వరకు 50కిలోమీటర్లు, భూపాలపల్లి మండలం కమలాపూర్ రోడ్డు పొడవునా 25 కిలోమీటర్లు జంగిల్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా చదును చేయడం, అవసరమైన చోట సైడ్బర్మ్ పోయడం, వాహనాలకు అడ్డు వచ్చే చెట్ల కొమ్మలను కట్ చేయిస్తున్నారు. అయితే చెట్లను మాత్రం తొలగించొద్దు.
కానీ మండలంలోని కమలాపూర్, రాంపూర్ గ్రామాల మధ్య జంగిల్ కటింగ్లో భాగంగా యథేచ్ఛగా చెట్లను నరికేస్తున్నారు. ఈ రోడ్డు వెంట గట్టమ్మ ఆలయ సమీపంలో సుమారు పది భారీ వృక్షాలు నేలకొరిగాయి. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆర్అండ్బీ డీఈ రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా మేడారం వరకు అటు కాటారం, ఇటు కమలాపూర్ గుండా రూ.15లక్షలతో జంగిల్ కటింగ్ పనులు చేపట్టామని, అవసరమైన చోట సైడ్బర్మ్ పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఎక్కడ కూడా చెట్లు నరికేయలేదని, అడ్డుగా వచ్చే కొమ్మలను మాత్రమే కట్ చేస్తున్నామని చెప్పారు. అటవీశాఖ రేంజ్ అధికారి నరేశ్ మాట్లాడుతూ మేడారం దారిలో చెట్లను నరికేసిన విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.