నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 22 : లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున మహిషుడిని సంహరించింది. చెడుపై ‘మంచి’ సాధించిన విజయంగా ఆ రోజున విజయదశమిని జరుపుకుంటున్నాం. కాగా, నేడు సోమవారం ఈ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. హనుమకొండలోని సిద్ధేశ్వరాలయం, వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానం, చిన్న వడ్డెపల్లి, భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం, ములుగులో సాధన స్కూల్ పక్కనున్న స్థలంలో, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం, జనగామలోని బతుకమ్మ కుంట మైదానంలో రామ్లీలాకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఆసరా చేసుకొని, ముల్లోకాలను పీడించసాగాడు. అతడి బాధల నుంచి విముక్తి కల్పించాలని దేవతలంతా త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులు, మహిషాసురుడిని ఎదుర్కోవడం తమ వల్ల కాక, దుర్గామాతను వేడుకున్నారు. ఆమె తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం చేసి పదో రోజున మహిషాసురిడిని వధిస్తుంది. నాటి నుంచి విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పాండవుల కథ..
మరో కథ ప్రకారం.. అరణ్య, అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసుకున్న పాండవులు హస్తినాపురానికి చేరుకున్న రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకోగానే ప్రజలు దశమిని ఘనంగా జరుపుకుంటారు. దీంతో ఇది విజయదశమిగా మారిందని చెబుతారు. విజయదశమి వేడుకల్లో ఆయుధాలను, శమీవృక్షాన్ని పూజించేది కూడా ఈ కథను అనుసరించే! అడవిలో సహజంగా పెరిగే శమీ వృక్షం కొమ్మలను తీసుకొచ్చి గ్రామ చావడి, కాలనీల్లో, ఆలయాల ఆవరణల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. తర్వాత అందరూ అక్షింతలతో కలిపి, ఆ ఆకులను తీసుకుని బంధువులకు, పెద్దలకు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
తెలంగాణ సంప్రదాయం..
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా జరుపుకుంటారు. ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ పిండి వంటలు, కొత్త బట్టలు, ఆటలు, పాటలతో ఇల్లంతా సందడిగా మారుతుంది. ఆప్యాయతానురాగాలు, బావామరదళ్ల సరదాలు, కూడళ్ల వద్ద కోలాటాలు, నృత్యాలు, దేవుడి ఊరేగింపులతో గ్రామాలు కళకళలాడుతాయి. గ్రామాల్లో పాలపిట్టను దర్శించుకుంటారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని విశ్వసిస్తారు.
ఆయుధ పూజ ప్రత్యేకం
దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లకు పూజలు చేసి పూలతో అలంకరిస్తారు. దీని కోసం ఆలయాల్లో వాహనాలు బారులు తీరుతాయి.
ఆలయ అర్చకులు వాహనాలకు పూజలు చేసి తృణమో ఫణమో పుచ్చుకుంటారు.