వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేళయింది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రూ.50కోట్లతో రూపుదిద్దుకున్న వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం, విగ్రహాల పునః ప్రతిష్ఠాపన, పాలకుర్తిలో రూ.10కోట్ల నిర్మించిన సోమనాథుడి విగ్రహం, కల్యాణమండపం, రూ.2కోట్లతో కట్టిన మిషన్ భగీరథ కార్యాలయం, రూ.25కోట్లతో హరిత కాకతీయ హోటల్కు శంకుస్థాపనతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, వి.శ్రీనివాస్గౌడ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తికాగా భక్తులు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి కోరారు.
వేలాదిగా తరలిరావాలని మంత్రి పిలుపు
భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపనను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ఈమేరకు పాలకుర్తిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి సుమారు 30వేల మంది భక్తులు తరలిరానున్నారు. ప్రతి గ్రామం నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు-ఉషాదయాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. ఇటు గుడి ప్రారంభం, విగ్రహాల పునః ప్రతిష్ఠాపన, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు భూమిపూజతో పాటు గుట్టపై రాములోరి కల్యాణం నిర్వహించనున్నారు. ఆ తర్వాత నిర్వహించే సభలో మంత్రులు పాల్గొని మాట్లాడుతారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సమావేశంలో కాంట్రాక్టర్ కొడూరు నర్సింహారెడ్డి, సర్పంచ్ కత్తి సైదులు, దేవస్థానం చైర్మన్ వీరమల్ల జైహింద్, ఎంపీటీసీ తాళ్ల సోమనారాయణ, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, వర్రె వెంకన్న, అర్చకులు డీవీఆర్ శర్మ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు, పంగ సైదులు, నీరటి సోమన్న పాల్గొన్నారు.
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 3 : వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పున: ప్రతిష్టాపన కార్యక్రమ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అలాగే మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా సోమవారం త్రిదండి చినజీయర్ స్వామి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్లు హాజరవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రూ.50కోట్లతో నిర్మించిన వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందన్నారు. పాలకుర్తిలో రూ.10కోట్లతో తలపెట్టిన పాల్కురికి సోమనాథుడి మెమోరియల్ స్టాచ్యూ, సోమనాథుడి కల్యాణ మండపం, రూ.2కోట్లతో తలపెట్టిన మిషన్ భగీరథ కార్యాలయం, రూ.25కోట్లతో తలపెట్టిన హరిత కాకతీయ హోటల్ పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి వివరించారు. అలాగే వల్మిడిలో రూ.150కోట్లతో మంజూరు చేసిన పలు రోడ్లు, రూ.2కోట్లతో మంజూరు చేసిన బ్రిడ్జిని మంత్రులు ప్రారంభిస్తారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
మూడో రోజూ వైభవంగా ఉత్సవాలు..
వల్మిడి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు సీతారామచంద్ర స్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం మూడో రోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ పూజలను సన్నూరు ఆలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల రంగాచార్యస్వామి పర్యవేక్షణలో అర్చకులు ఘనంగా జరిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఉషాదయాకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి ధ్వజస్తంభానికి నీళ్లు పోశారు. ఉషా దయాకర్రావుతో పాటు కలెక్టర్ శివలింగయ్య దంపతులు, ఆలయ కాంట్రాక్టర్ కొడూరు నర్సింహారెడ్డి-సునీత, డీపీవో రంగాచారి-పద్మ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.