శాయంపేట, మార్చి 27 : పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీరెలతో ముసుగు వేశారు. పాలథిన్ కవర్లు కప్పాల్సిన శిలా ఫలకాలకు బతుకమ్మ చీరెలను ఎందుకు కట్టారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బతుకమ్మ చీరెలు జీపీలో ఉన్నాయా? పంపిణీ చేయలేదా? దెబ్బతిన్న చీరెలను ఇలా కోడ్ అమలుకు ఉపయోగించారా? అని జనం చర్చించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవ ప్రతీకలైన చీరెలను ఇలా శిలా ఫలకాలకు కట్టుగా మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో శిలా ఫలకాలకు బొంతలను కట్టారు. మరికొన్ని చోట్ల పేపర్లు అతికించారు. శిలా ఫలకాలు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రజల్లో చర్చ జరుగుతోంది.