వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. పాడి గేదెల ఒక్కో యూనిట్ విలువ రూ.4 లక్షలు కాగా, ఇందులో తెలంగాణ సర్కారు రూ.2.40 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నది. మిగతా రూ.1.40 లక్షలను బ్యాంకులు రుణంగా అందజేస్తున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల్లోని 380 మంది ఎస్సీలకు రెండేసి బర్రెలను అందజేసింది. పాల సేకరణ కోసం విజయ డెయిరీ కేంద్రాలనూ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన మరో 81 మందికి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. వీరిలో 44 మంది కోసం హర్యానాలో గేదెలను కొనుగోలు చేయగా, ఇవి శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
వరంగల్, మార్చి 30(నమస్తేతెలంగాణ) : పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఎస్సీలకు పాడి గేదెల పంపిణీ పథకాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తాజాగా ఈ పథకం ద్వారా మరో రెండు మండలాల్లో 81 మంది ఎస్సీలకు గేదెల యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 44 మంది లబ్ధిదారులకు హర్యానాలో గేదెలను కొనుగోలు చేశారు. లారీల ద్వారా ఇవి శుక్రవారం జిల్లాకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఎస్సీలకు ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి గేదెల పంపిణీ పథకానికి రూపకల్పన చేసింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో నర్సంపేట నియోజకవర్గంలో తొలివిడుత దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లోని 435 మంది ఎస్సీలకు గేదెల యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో పాడి గేదె యూనిట్ విలువ రూ.4 లక్షలు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.40 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది. మిగతా రూ.1.40 లక్షలను బ్యాంకులు రుణంగా అందజేస్తున్నాయి. అలాగే లబ్ధిదారుల నుంచి పాల కొనుగోలుకు ప్రభుత్వం విజయ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎవరి జామీను లేకుండా బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకు ప్రభుత్వం రెండు విడుతల్లో నాలుగు గేదెలను పంపిణీ చేస్తుంది. తొలి విడుత రెండు, మలి విడుత రెండు గేదెల చొప్పున రూ.4 లక్షల యూనిట్ను అందజేస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దీన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా మొదటి దశ పంపిణీ చేసేందుకు నిర్ణయించిన నాలుగు మండలాల్లో 435 యూనిట్ల లక్ష్యానికి 380 మందికిపైగా అధికారులు రెండేసి పాడి గేదెల చొప్పున పంపిణీ చేశారు. వీరిలో సుమారు వంద మందికి రెండో విడుత మరో రెండు పాడి గేదెలను కూడా అందజేశారు. దశల వారీగా ఇతరులకూ మిగతా రెంండింటిని పంపిణీ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఈ నాలుగు మండలాల్లో విజయ డెయిరీ పాల సేకరణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి పాడి గేదెలను పొందిన ఎస్సీల నుంచి ఈ కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నది.
పైలట్ ప్రాజెక్టు మంచి ఫలితాన్నిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో మిగిలిన నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో కూడా గేదెలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పెద్ది ప్రతిపాదించారు. ఆయన పట్టుదలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు విస్తరించింది. దీంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. తొలి విడుత 81 మంది అర్హులను గుర్తించారు. నల్లబెల్లి మండలంలో 50, నెక్కొండ మండలంలో 31 మందికి గేదెల యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందారు. ఈ మేరకు హర్యానా రాష్ట్రంలో పాడి గేదెలను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. నల్లబెల్లి మండలం నుంచి 47, నెక్కొండ మండలం నుంచి 30 మందితో అధికారులు హర్యానా వెళ్లారు. వీరిలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజుతో పాటు పశుసంవర్ధక శాఖ డాక్టర్లు ఉన్నారు. కాగా, మార్గమధ్యంలో నల్లబెల్లి మండలానికి చెందిన 25, నెక్కొండ మండలానికి చెందిన 8 మంది ఆగ్రాలో రైలు దిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు మండలాల నుంచి మిగిలిన 44 మంది లబ్ధిదారులతో అధికారులు ఢిల్లీలో దిగి హర్యానాలోని రోహ్తక్ ప్రాంతానికి చేరుకున్నారు. సెలెక్ట్ చేసిన ఏజెన్సీల వద్ద 88 పాడి గేదెలను కొనుగోలు చేశారు. శుక్రవారం గేదెలు జిల్లాకు చేరుకుంటాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెల్లడించారు. మిగిలిన లబ్ధిదారులకూ త్వరలోనే హర్యానాలో పాడి గేదెలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
– సురేశ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, వరంగల్
పాడి గేదెల కొనుగోలు కోసం మంగళవారం నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన 77 మంది లబ్ధిదారులతో కలిసి రైల్లో హర్యానా వెళ్లాం. అందరం ఢిల్లీలో దిగాల్సి ఉంది. హైదరాబాద్కు చెందిన ఓ దళారీ ప్రమేయంతో నల్లబెల్లి మండలానికి చెందిన 25, నెక్కొండ మండలానికి చెందిన 8 మంది ఆగ్రాలో దిగారు. వారిని దళారీ ప్రలోభ పెట్టినట్లు తెలుస్తొంది. సదరు దళారీ మమ్మల్ని కూడా బెదిరింపులకు గురి చేశాడు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చాం. దళారీ మాటలు నమ్మి మోసపోయిన వారికీ త్వరలోనే పాడి గేదెలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తాం. లబ్ధిదారులు దళారీల వలలో పడొద్దు.