స్వయం సహాయక సంఘం ఆమె తలరాతను మార్చేసింది. కేవలం వ్యవసాయంతోనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయం సంపాదించాలనే ఆలోచనకు ‘ఎస్హెచ్జీ’ ఊతమిచ్చి ఉపాధికి మార్గం చూపింది. ఫలితంగా సొంత గ్రామంలో నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి గత సర్కారీ సాయాన్ని సద్వినియోగం చేసుకున్నది. భర్త సహకారంతో బల్క్గా ముడిసరుకులు తెచ్చుకుని రాగి, గోధుమపిండి, బియ్యం పిండి, కారంపొడి తయారు చేస్తూ పరిసర పట్టణాలకు రవాణా చేస్తున్నది. సరికొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడల్పేటకు చెందిన మహిళా రైతు కొమురవెల్లి రజిత. ఇటీవల డీఆర్డీఏ ద్వారా ఫ్లిప్కార్ట్ ఆర్డర్లకు సైతం దరఖాస్తు చేసుకొని విజయవంతంగా దూసుకెళ్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట గ్రామానికి చెందిన కొమురవెల్లి రజిత, రాజు దంపతులది వ్యవసాయ కుటుంబం. గ్రామంలో వారికి నాలుగెకరాల భూమి ఉంది. సేద్యం చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. వ్యవసాయంతో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించాలని రజిత ఆలోచించింది. కాగా రజిత స్వయం సహాయక సంఘం(శ్రీ భవాని మహిళా పొదుపు సంఘం)లో 20ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నది. మహిళా సంఘాల ద్వారా వచ్చే అదనపు రుణాల గురించి అధ్యయనం చేసింది. సర్కారు అందించే సంఘాల రుణాల సాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసుకుని వ్యాపారం మొదలుపెట్టాలని భావించింది. డీఆర్డీఏలోని సీసీ, ఏపీఎం, డీపీఎంలను సంప్రదించి వివరాలు సేకరించింది. స్త్రీనిధి, పీఎం ఎఫ్ఎంఈ, మండల సమాఖ్య, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకుని యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
మొదట స్త్రీనిధి ద్వారా రూ.లక్ష రుణం తీసుకుని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి విజయవంతంగా కొనసాగించింది రజిత. ఆ తర్వాత భవాని మహిళా పొదుపు సంఘం నుంచి వచ్చిన రూ.80వేల రుణంతో కిరాణా షాపు పెట్టింది. అంతటితో ఆగకుండా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించి డీఆర్డీఏ అధికారుల సాయంతో పీఎం ఎఫ్ఎంఈ(ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్) ద్వారా రూ.2.83లక్షల రుణం తీసుకుంది. అలాగే మండల సమాఖ్య నుంచి రూ.40వేల రుణం తీసుకుని మరో రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పింది. మొత్తం నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రాగి, గోధుమ, బియ్యం పిండి, పసుపుతో పాటు కారం పొడి తయారీ చేస్తూ ప్యాకింగ్ ద్వారా విక్రయాలు జరుపుతున్నది. మరో వైపు కిరాణ షాపును విజయవంతంగా నడిపిస్తున్నది.
రజిత-రాజు దంపతులకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాల్లో రాగులు పండిస్తున్నది. పండించిన పంట ద్వారా వచ్చిన రాగులను ప్రాసెసింగ్ చేస్తూ వినియోగదారులకు విక్రయిస్తున్నది. అలాగే పరకాల, వరంగల్ నుంచి గోధుమలు, బియ్యం, పసుపు కొమ్ములు బల్క్గా కొనుగోలు చేసి తెచ్చుకుని వాటిని ప్రాసెసింగ్ చేస్తూ ప్యాకెట్ల ద్వారా గోధుమపిండి, బియ్యం పిండి, పసుపు విక్రయాలు చేస్తున్నారు. భూపాలపల్లితో పాటు చెల్పూరు, పరకాల, చిట్యాల తదితర పట్టణాల్లోని హోటళ్లకు ఆర్డర్ ప్రకారం సరఫరా చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేలకు పైనే మిగులుతున్నాయని రజిత చెబుతోంది. దీనికి తోడు కిరాణం, వ్యవసాయం ఆర్థికంగా సపోర్టు చేస్తున్నాయని తెలిపింది.
20ఏళ్లుగా నేడు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నా. కానీ గత 10ఏళ్లలోనే మహిళా సంఘాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రత్యేకంగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. గత ప్రభుత్వ సాయంతోనే వ్యాపారం ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉన్నం. కుమారుడు, కుమార్తెను మంచిగ చదివిస్తున్న. డీఆర్డీఏ అధికారులు మేము తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ను తీసుకున్నారు. ఫ్లిప్కార్ట్కు దరఖాస్తు చేశాను. అనుమతి వస్తే ఫ్లిప్కార్ట్ ద్వారా మేము తయారు చేసే ఉత్పత్తులు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా ఎలాంటి రుణాలు తీసుకోవచ్చనే విషయంపై స్టడీ చేశాను. ఇన్ని రకాల రుణాలు తీసుకోవచ్చా అని సీసీలు, ఏపీఎంలు చెప్పిన రుణాల వివరాలపై ఆశ్చర్యపోయా. స్త్రీనిధి, స్వయం సహాయక సంఘాలు, పీఎం ఎఫ్ఎంఈ నుంచి రుణాలు తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నా.