వరంగల్, ఏప్రిల్ 25 : నిరుపేదలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు మంజూరు చేస్తున్నామని సర్కారు చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదు. ఫలితంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు అరిగోస పడుతున్నారు. దరఖాస్తులపై సంత కం పెట్టేందుకు ఇందిరమ్మ కమిటీ సభ్యు లు ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో మొదటి విడుతలో 5,922 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకా రం 45 రోజుల్లో ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాలి. అయితే లబ్ధిదారుల్లో సగం మంది పలు కారణాలతో నేటికీ ముగ్గు పోయలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టని వారిని గుర్తిస్తున్న అధికారులు వా టిని రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నగర పరిధిలోని ఆయా డివిజన్లలో ఇందిరమ్మ కమిటీ స భ్యుల మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యాలతో దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్సొరేట ర్ ఉన్న డివిజన్లలో సమస్య జఠిలంగా మా రుతున్నది.
కార్పొరేటర్ చైర్మన్గా, మరో నలుగురు సభ్యులతో ప్రతి డివిజన్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు సంతకాలు చేసి ఆమోదం చెబితేనే వార్డు అధికారి సదరు దరఖాస్తులను కలెక్టర్ లాగిన్కు పంపిస్తారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కమిటీ సభ్యులు కీలకంగా మారారు. ఐదుగురు సభ్యుల సంతకాల కోసం దరఖాస్తుదారులు కమిటీ సభ్యుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ‘మొదట అక్కడికి ఎందుకు పోయావు, నా దగ్గరికి రావాలి కదా’ అనే ప్రశ్నలతో సంతకాలు పెట్టకుండా దరఖాస్తుదారులను తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముడుపులిస్తేనే సంతకాలు..
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కమిటీ సభ్యుల ఆధిపత్యం పెరిగిపోయింది. ఇళ్ల మంజూరుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవాల్సి ఉండడంతో లభ్ధిదారులతో ముందే ఒప్పందం చేసుకుంటున్నారు. ఒక్కో ఇంటికి రూ.50 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో అధికార పార్టీకి చెందిన నాయకులే ఉండడంతో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు వారు అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై సంతకాలు పెట్టే ప్రక్రియ నుంచే దందాకు తెరలేపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ విషయం తెలిసినా పట్టించుకోని అధికారులు ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన జాబితాను మాత్రమే తాము తీసుకుంటామని చెబుతున్నారు. కమిటీ సభ్యుల సంతకాలు పెట్టించుకోవాల్సిన బాధ్యత దరఖాస్తుదారులదే అంటున్నారు.