పాలకుర్తి రూరల్, అక్టోబర్ 17 : స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల తప్పదం ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఆడ శిశువని చెప్పడంతో గర్భిణికి పాలకుర్తిలో ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేసి మృత మగ శిశువును బయటకు తీయగా భ్రూణహత్య వెలుగుచూసింది. పాలకుర్తి పట్టణానికి చెందిన ఆర్ఎంపీ గుగులోత్ రాములు, భార్య క్రాంతి కొన్నేళ్లుగా అబార్షన్లు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మండలంలోని దుబ్బతండా బీ గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు ఇద్దరు ఇద్దరు కూతుళ్లు. ఆతర్వాత గర్భం దాల్చగా జనగామ, హనుమకొండలోని స్కానింగ్ సెంటర్లలో చూపించుకుంది. ఆడ శిశువు అని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో పాలకుర్తిలో ఆర్ఎంపీ రాములు వద్ద సోమవారం రాత్రి అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ తర్వాత మృత మగ శిశువు బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు శోకం మిగిలింది.
విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి ప్రశాంత్కుమార్ మంగళవారం వైద్య సిబ్బందితో సదరు ఆర్ఎంపీ పాలకుర్తిలోని క్లినిక్ను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆర్ఎంపీ లేకపోవడంతో భార్య సోమవారం రాత్రి అబార్షన్ చేయగా మగ శిశువని తేలిందని పేర్కొంది. ఎలాంటి అనుమతి లేకుండా చేయడంపై జిల్లా వైద్యాధికారి ఆగ్రహించారు. ఆయన్ను వివరణ కోరగా పాలకుర్తి పట్టణంలోని ఆర్ఎంపీ ఓ గిరిజన మహిళకు అబార్షన్ చేసి మృత శిశువును బయటకు తీసిన విషయంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఆర్ఎంపీ పీఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. ఆబార్షన్లతో పాటు అనుమతి లేని వైద్యం చేయరాదని సూచించారు. అనుమతులు లేకుండా వైద్యం చేస్తే క్లినిక్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.