వరంగల్ చౌరస్తా, జనవరి3: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్. వెంకన్న అన్నారు. వరంగల్ 27వ డివిజన్ పరిధిలోని యాకుబ్పురలోని గిరిజన సాంఘిక సంక్షేమ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఇగ్నైట్ 2023-24 పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర, సాంకేతికతపై ఎప్పటికప్పుడు విద్యార్థులు అధ్యయనం చేయాలని అన్నారు. నేటి ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతికత ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ వస్తున్నదన్నారు.
వీటిని అందిపుచ్చుకోవడం మూలంగా ఆధునిక ప్రపంచంలో మనదైన ముద్ర వేయగలమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా శాస్త్ర సాంకేతికతలో వస్తున్న మార్పులను పరిశీలించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు శ్రీనివాసరెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది, రీజినల్ పరిధిలోని 24 పాఠశాలల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.