గోవిందరావుపేట, జనవరి 8: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ములుగు జిల్లా ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పస్రా గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్(42) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. ఇంటి వద్ద ఉన్న అతడికి సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పి రాగా చికిత్స కోసం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. అతడు రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మలిదశ ఉద్యమంలో చెప్పులు వేసుకోకుండా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడి పేరుపొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్లికార్జున్ కలువగా అభినందించారు. ప్రస్తుత ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడిగా కొనసాగుతూ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నాడు. కాగా, ఆయన మృతిపై మండలంతోపాటు జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వగ్రామం వద్ద మృతదేహాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మల్లికార్జున్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆయన మృతిచెందిన వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులతో ఫోన్లో పరామర్శించారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లికార్జున్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఆయన ఫోన్లో సంతాపం ప్రకటించారు. మల్లికార్జున్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చేసిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామన్నారు.