ములుగు, మార్చి18 (నమస్తేతెలంగాణ) : పేద గిరిజన లంబాడా కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుని నేడు ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఉన్నత చదువుల కోసం కూలీ పనులకు వెళ్లి ఉపాధ్యాయ కొలువు కొట్టాడు. ఆ వృత్తిలో కొనసాగుతూనే డిప్యూటీ జైలర్ ఉద్యోగాన్ని సాధించాడు ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గుగులోత్ సమ్మయ్య. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్గా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఆయన ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొంది ప్రస్తుతం చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్గా బాధ్యతలను స్వీకరించారు. దీంతో ములుగు జిల్లా కేంద్రంతో పాటు దేవగిరిపట్నం గ్రామంలో ప్రజలతో పాటు స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
గుగులోత్ చందూనాయక్-తారమ్మ ప్రథమ సంతానం సమ్మయ్య. ఆయన 1963లో దేవగిరిపట్నం గ్రామంలో జన్మించాడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. 5వ తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ములుగు ఎస్టీ హాస్టల్లో ఉంటూ విద్యను కొనసాగించారు. అనంతరం కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హనుమకొండలో బీఈడీ పూర్తి చేశారు. కేయూలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి తొలి పోస్టు జాకారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1992లో డిప్యూటీ జైలర్గా ఉద్యో గం సాధించి వరంగల్ సెంట్రల్ జైళ్లో పనిచేశారు. సూర్యాపేట, రాజమండ్రి, మెదక్, జమ్మలమడుగు జైళ్లలో పనిచేసి ఖైదీల పరివర్తనకు విశేష కృషి చేశారు. ఆ తర్వాత పదోన్నతి పొంది కరీంనగర్ జైలు సూపరింటెండెంట్గా నాలుగేళ్ల పాటు పనిచేసి ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొంది చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. స మ్మయ్యకు భార్య అనిత, కుమారుడు వికాస్, కుమార్తె అలే ఖ్య, అల్లుడు షణ్ముఖకుమార్ ఉన్నారు. కుమారుడు ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కుమార్తె, అల్లుడు వైద్యులుగా స్థిరపడ్డారు. కాగా, విధి నిర్వహణలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందారు. ఏ చిన్న సమయం దొరికినా పుట్టి పెరిగిన ఊరికి వచ్చి గ్రా మస్తులతో స్నేహపూర్వకంగా మెదులుతూ వస్తున్నారు.