నగరంలోని ఎర్రగట్టు గుట్ట జంక్షన్లో సోమవారం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లడంతో గజిబిజిగా మారింది. అదే సమయంలో ఆ దారిన పరీక్షలు రాసేందుకు వెళ్తున్న సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులు ఇరుక్కుపోయారు.
ఓ వైపు సమయం అవుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో చివరకు స్థానికులే ట్రాఫిక్ను క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇలా గంట పాటు ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో నగరవాసులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేయడం కనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్