హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 7 : తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ పోటీలకు 33 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ.. జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడల్లో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలన్నారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు ఉచిత భోజన వసతితో పాటు ఎంట్రీ ఫీజు లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈ నెల 11 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్న క్రీడ రెజ్లింగ్ అని, నగరంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శాట్స్ పరిశీలకుడు, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్ నాయక్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కైలాసం యాదవ్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు రాజ్కుమార్, జైపాల్, షేక్ రియాజ్, కాసిం హుస్సేన్, సాయిలు, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.