హనుమకొండ చౌరస్తా, మే 22 : బాల్యం నుంచే క్రీడల్లో పాల్గొనాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వన్ బాషా, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్తో కలిసి రాజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడారంగంలో జిల్లాను ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు.
ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయని చెప్పారు. ఇకడ రాణించే క్రీడాకారులను ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే హనుమకొండ జిల్లా జట్లకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనను జడ్పీ చైర్పర్సన్ కన్నా మారథాన్ రన్నర్గా కేటీఆర్ సహా అందరూ ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలో ఓవరాల్ చాంపియన్షిప్ సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్ నాయక్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు దాదాపు 1500 మంది క్రీడాకారులు 18 క్రీడాంశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రాజయ్య, గండ్ర జ్యోతి..
ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్, డీసీపీ ఎంఏ బారి , ఏసీపీలు శ్రీనివాస్, కిరణ్ కుమార్, జిల్లా మైనార్టీ అధికారి మీన శ్రీను, డీఈవో అబ్దుల్ హై, ఇండస్ట్రీస్ జీఎం హరిప్రసాద్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల్లో క్రీడాకారులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులు ఎండను సైతం లెక్కచేయకుండా నువ్వానేనా అన్నట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. మొదటి రోజు జరిగిన క్రీడల్లో హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కబడ్డీలో, హాకీ పోటీలను పురుషులు, మహిళల విభాగంలో నిర్వహించినట్లు జిల్లా క్రీడలు, యువజన అధికారి తెలిపారు. మంగళవారం వాలీబాల్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఆర్చరీ పోటీలు నిర్వహిస్తామని, ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఉదయం 7 గంటలకు జేఎన్ఎస్లో హాజరు కావాలని అశోక్కుమార్ కోరారు.
వరంగల్లో..
కాశీబుగ్గ : వరంగల్ ఓ సిటీ మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ బారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. వరంగల్ను జిల్లాను ఏర్పాటు చేసుకున్నందుకే ఓ సిటీ మైదానంలో క్రీడలు జరుగుతున్నట్లు తెలిపారు. 13 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఉత్తమ ప్రతిభను కనబర్చాలని కోరారు. వచ్చే ఏడాది క్రీడోత్సవాల ప్రారంభం నాటికి రూ.5కోట్ల నిధులతో నూతన స్టేడియం శంకుస్థాపన కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ, డీఎస్డీవో ఇందిర, వరంగల్ తహసీల్దార్ సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు.