వర్ధన్నపేట/నెక్కొండ/చెన్నారావుపేట, అక్టోబర్ 6: దేవీ శరన్నవరాత్రోత్సవాలు ముగియడంతో గురువారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఎదురేగి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం దుర్గామాత విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా వర్ధన్నపేటతోపాటు ఇల్లందలో నిర్వాహకులు దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్రను కనులపండువగా నిర్వహించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. నెక్కొండ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి శోభాయాత్రను గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊర చెరువు వరకు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, రాజకీయ నాయకులు, మహిళలు, భవానీమాత మాలధారులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని శివాలయంలో ఉప సర్పంచ్ మాధవి-మల్లయ్య ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జక్క అశోక్ ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్రెడ్డి, దామోదర్రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ఊరేగింపుగా తరలివెళ్లి..
గీసుగొండ/నర్సంపేటరూరల్/దుగ్గొండి: గీసుగొండ మండలంతోపాటు వరంగల్ 15, 16వ డివిజన్లో దుర్గామాత ప్రతిమలను ప్రత్యేక వాహనాల్లో భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొమ్మాల, ధర్మారం, మొగిలిచర్ల, ఎలుకుర్తిలో అమ్మవారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. నర్సంపేట మండలం ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, మాదన్నపేట, ద్వారకపేట, లక్నేపల్లి, సర్వాపురంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజు అభిషేకాలు చేసి లడ్డూ వేలం వేశారు. సాయంత్రం దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు. దుగ్గొండి మండలంలోని నాచినపల్లి, బంధంపల్లి, కేశవాపురంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మండలకేంద్రంలో గ్రామ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నాచినపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు నైవేద్యాలు సమర్పించారు.