వర్ధన్నపేట, డిసెంబర్ 29: రైతులకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాల రికవరీపై అధికారులు, పీఏసీఎస్ పాలక మండలి సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. వర్ధన్నపేట డీసీసీ బ్యాంకు కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులు, పాలకమండలితో బ్యాంకు రుణాలు, రికవరీపై గురువారం ఆయన సమీక్షించారు. వర్ధన్నపేట డీసీసీబీ పరిధిలోని రాయపర్తి, వర్ధన్నపేట మండలాలకు చెందిన రైతులకు గతంలో పెద్ద మొత్తాల్లో రుణాలు మంజూరు చేశామన్నారు. కానీ, అనుకున్న మేరకు రుణాలను రికవరీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వా త రైతులతోపాటు చిరువ్యాపారులు, అవసరం ఉన్న ప్రజలకు కూడా వాణిజ్య బ్యాంకులకు తీసిపోకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రుణాలు వాయిదాల వారీగా వసూలు అవుతున్నా పాత బకాయిలు అనుకున్న మేరకు రికవరీ కావడం లేదని వివరించారు.
ఈ విషయమై గ్రామాలు, మండలాల వారీగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పీఏసీఎస్ల చైర్మన్లు, కమిటీల సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారులు గ్రామాల వారీగా రైతులకు నోటీసులు ఇస్తూ బకాయిలను తప్పకుండా వసూలు చేయాలన్నారు. వర్ధన్నపేట బ్యాంకు పరిధిలో రికవరీ చేసేందుకు మేనేజర్తోపాటు ప్రత్యేక మేనేజర్ను కూడా నియమించినట్లు మార్నేని చెప్పారు. అధికారులు జాబితా ఆధారంగా బకాయిలు వసూలు చేయడంపై దృష్టి సారించాలని కోరారు. మార్చి నాటికి 90 శాతానికి పైగా పాత బకాయిలు వసూలు చేయాలన్నారు. సమీక్షలో పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, బ్యాంకు మేనేజర్ శ్రవణ్, ఫీల్డాఫీసర్ సురేశ్, జిల్లా అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.