సుబేదారి, ఏఫ్రిల్ 10: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు సోమవారం విచారించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 4న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నిందితుల నుంచి ఈటల రాజేందర్కు, ఇద్దరు పీఏల సెల్ఫోన్లకు వాట్సాప్ ద్వారా హిందీ లీకేజీ ప్రశ్నపత్రం పంపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో విచారణకు హాజరుకావాలని కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్కు, ఆయన ఇద్దరు పీఏలకు కమలాపూర్ పోలీసులు నోటిస్లు అందజేశారు.
విచారణ నిమిత్తం ఈనెల 7న వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయానికి ఈటల పీఏలు నాగరాజు, రాజు విచారణకు హాజరైన విషయం విధితమే. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చారు. అయితే ఈటల వెంట కొం దరు అడ్వకేట్స్ వెంట రాగా పోలీసు అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. కేసు విచారణలో భాగంగా ఆయనను మాత్రమే విచారిస్తాం, ఎవరూ డీసీపీ చాంబర్లోకి రావొద్దని పోలీసు అధికారులు చెప్పడంతో న్యాయవాదులు వెనుదిరిగారు.
సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని సెం ట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ను విచారించారు. సెంట్రల్ జోన్ డీసీపీ భారి , కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో విచారణ అధికారి కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్ విచారణ జరిపారు. మీ సెల్ఫోన్ వాట్సాప్కు టెన్త్ హిందీ లీకేజీ ప్రశ్నపత్రం పంపిందెవరు, ఏ2గా ఉన్న ప్రశాంత్ పంపించారా? ఎవరు పంపించారు, మీకు వచ్చిన వాట్సాప్ లీకేజీ పేపర్ను మీరు ఎవరికైనా పంపించారా? లీకేజీ విషయంలో ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడారా ? అని విచారణ అధికారి ప్రశ్నించారు. తనకు మహేశ్ వాట్సాఫ్ ద్వారా లీకేజీ ప్రశ్న పత్రం పంపించారు, కాని దాన్ని ఓపెన్ చేయలేదు, నాకు వచ్చిన ఫోన్ మాట్లాడడం, కాల్ చేయడం తప్ప , వాట్సాప్లో మెసేజ్లు పం పించడం రాదు, అంతా పీఏలు చూసుకుంటారని రాజేందర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ఈటల ఫోన్ పరిశీలన
మీసెల్ ఫోన్ వాట్సాప్కు వచ్చిన హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ మెసేజ్ చూపించండి అని విచారణ అదికారి ఈటలను ప్రశ్నించారు. దీంతో ఈటల డీసీపీ ఆఫీస్ గది నుంచి బయటకు వచ్చి పీఏ చైతన్యను లోపలికి తీసుకెళ్లి పీఏతో తన ఫోన్లో ఉన్న ఏ3 నిందితుడు మహేశ్ పంపించిన హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ మెసేజ్ను పోలీసు అధికారులకు చూపించినట్లు తెలిసింది. ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను విచారణ అధికారి సంజీవ్ నమోదు చేశారు. విచారణ సుమారు గంట పాటు కొనసాగింది. విచారణ ముగియడంతో ఈటల రాజేందర్ బయటికి వచ్చారు.