కాశీబుగ్గ, మార్చి15 : అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు విషయంలో అందినకాడికి దండుకోజూసిన ఓ ‘మార్కెట్ చేప’ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. రూ.30 వేలు లంచం తీసుకుంటూ వరంగల్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డీఈ (ప్రస్తుతం ఇన్చార్జి ఈఈ) మహమ్మద్ సిరాజ్ మొహియుద్దీన్ బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు, ఎస్టిమేషన్ విషయంలో హనుమకొండలోని భవానీనగర్కు చెందిన కాంట్రాక్టర్ కోడెల వెంకట శైలేంద్ర నుంచి రూ.65 వేలు డిమాండ్ చేశాడు. కాగా సంబంధిత కాంట్రాక్టర్ రూ.30 వేలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకొని ఏసీబీ ఆధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో వరంగల్లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ (పాత గ్రేయిన్ మార్కెట్) ఈఈ కార్యాలయంలో దాడులు చేసి మొహియుద్దీన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.