హనుమకొండ, జూలై 19 : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు జీవనోపాధి, ఉద్యోగం, వ్యాపారం, విద్య తదితర కారణాలతో పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మందికి సొంత గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఓటు హక్కు ఉంది. తప్పులు లేని ఓటరు జాబితా తయారీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక పౌరుడు ఒకే ఓటు కలిగి ఉండాలనే స్పష్టమైన నిబంధన పెట్టింది.
ఇందులో భాగంగా గత నెల 25 నుంచి సర్ ప్రక్రియను చేపట్టింది. ఈ నేపథ్యంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తూ డూప్లికేట్ ఓటర్లను తొలగించడం, చిరునామా మార్పులను నమోదు చేయడం వంటివి చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న చాలా మంది ఓటర్లు తమ సొంత ఊర్లోనే ఓటు నమోదు చేసుకోవాలని ముందుకు వస్తున్నట్లు తెలిసింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో ఆదివారం మద్యాహ్నం 2గంటల వరకు 76.50 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
జీవనోపాధి కోసం వలస వెళ్లిన వారి ఇండ్లు, భూములు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. అక్కడ ఓటు ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో అమలయ్యే పలు సంక్షేమ పథకాలు అందుతాయని భావిస్తున్నారు. అలాగే తమకు స్థానికంగా ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం కూడా వారిలో కనిపిస్తున్నది. స్థానిక ఎన్నికల్లో భాగస్వామ్యం కావడంతో పాటు అక్కడి సమస్యలను ప్రస్తావించే అవకాశం లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల వాళ్లు ఫోన్లు చేసి పల్లెల్లో ఓటు హక్కు ఉంటేనే బాగుంటుందని ఫోన్లు చేస్తుండడంతో అటువైపు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఓట్ల సంఖ్య పదిలంగా ఉంటూనే పట్టణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుది ఓటరు జాబితా విడుదలయ్యే సమయానికి ఈ మార్పు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) నింపడం తెలియక చాలా మంది ఓటర్లు ఇప్పటికీ తికమకపడుతున్నారు. 2002 ఓటరు జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం, వివాహమై అత్తగారి ఇంటికొచ్చిన మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత జాబితాలో కొందరు ఓటర్ల ఇంటి పేరు చివరన ఉండగా, ప్రస్తుత జాబితాలో ముందు ఉండడంతో ఎలా నింపాలో తెలియని సందిగ్ధత ఓటర్లలో నెలకొంది. బీఎల్వోలు సైతం ఈ విషయంలో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా, సర్ ప్రక్రియకు ప్రజలు సహకరిస్తే ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేరొంటున్నారు.