Warangal | పోచమ్మమైదాన్, మే 24: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓరుగల్లు విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని నింపింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చిన విషాద ఘటన వరంగల్ పోచమ్మమైదాన్లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ నగరంపోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన బస్వరాజు విజయ, రమేశ్ దంపతుల కుమార్తె బస్వరాజు శ్రావణి (27) లండన్లోని బ్లూమ్స్బరీ ఇనిస్టిట్యూట్లో ఎమ్మెస్సీ (మేనేజ్మెంట్) కోర్సు చదివేందుకు వెళ్లింది. శ్రావణి తండ్రి రమేశ్ లారీ డ్రైవర్ కాగా తల్లి విజయ గృహిణి. లండన్లో చదువుతున్న శ్రావణి గత సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి లండన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్ధిక ఇబ్బందులే కారణమా..?
బిడ్డ ఉన్నత చదువుల కోసం రమేశ్ తన సొంతింటిని అమ్మి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శ్రావణి ఆత్మహత్యకు యత్నించి ఉండవచ్చని యూకే ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ నీలా తెలిపారు. యూనివర్సిటీ ఫీజులు చెల్లించడానికి, భారతదేశంలో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లించడానికి కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా శ్రావణి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే స్థోమత లేకపోవడంతో కుటుంబ కష్టాలను మరింత పెంచింది. లండన్లోని ఎన్ఆర్ఐ ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్, ఫౌండర్ కిరణ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ఉమెన్ వింగ్ సెక్రటరీ మేరీ లండన్లోని ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి, మృతదేహాన్ని బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫోరం తరుపున రూ.30 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిసింది.