ఎల్కతుర్తి, డిసెంబర్ 12 : ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు గతానికి భిన్నంగా బంతి, గులాబీ పూల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు, గిరాకీని బట్టి పండుగ సీజన్లలో ఎక్కువ బంతిని రైతులు సాగుచేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని వల్భాపూర్, జీల్గుల గ్రామాల్లో కొందరు బంతి పూలను సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. హుజూరాబాద్కు చెందిన చక్రధర్ జీల్గుల గ్రామంలో తనకున్న ఎకరం 30గుంటల భూమిలో బంతి, గులాబీ తోటలు సాగు చేస్తున్నాడు. ఒక్కో మొక్కకు రూ.38 వెచ్చించి దాదాపు 2700 మొక్కలు నాటాడు. ఇందుకోసం రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం గులాబీ పంట ఏపు పెరిగింది. మిగతా భూమిలో బంతి సాగుచేస్తున్నాడు. బంతి సాగుకు రూ.లక్షా 50వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పండుగ సీజన్లలో బంతి పూలను వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. హోల్సేల్గా కిలోకు రూ.50 చొప్పున పూలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఐదు నెలల కాలంలో బంతి పూలపై లక్షన్నర వరకు లాభం వచ్చినట్లు రైతు చక్రధర్ చెప్పాడు.
వరి, పత్తి, మిరప తదితర పంటల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతోంది. లాభాలు కూడా తక్కువ ఉంటున్నాయి. అందుకే బంతి, గులాబీ తోటల సాగు చేస్తున్నా. గులాబీ తోటపై పెట్టుబడి బాగా పెట్టాను. ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి. బంతి పూలు మాత్రం దసరా, దీపావళి, సంక్రాంతి పండగలకు బాగానే అమ్ముడుపోయాయి. ఇప్పటివరకైతే బంతి పూలతో ఆమ్దానీ బాగానే ఉంది. వ్యాపారులు తోట వద్దకే వచ్చి హోల్సేల్గా కిలోకు రూ.50 చొప్పున క్వింటాళ్ల లెక్కన తీసుకెళ్తున్నారు. బంతిపూల సాగు ఇతర పంటల కంటే బాగుంది.