దామెర, నవంబర్ 23 : ఊరుగొండ గ్రామ శివారు లోని తురకల గుట్ట వద్ద వారం రోజులుగా చేపట్టిన తవ్వకాల్లో పురాతన ఆలయ మండపం, శివలింగం, నాగిని శిల్పం బుధవారం బయల్పడ్డాయి. ఇటీవల తురకల గుట్టను ఆనుకుని ఓ వ్యక్తి భూమిని చదును చేసే పనులు చేపట్టాడు. జేసీబీ సాయంతో చెటు, ముళ్లపొదలను తొలగించిన ఆ వ్యక్తి గుట్టను ఆనుకుని పెద్ద కందకం తీయిస్తున్నాడు. ఈ క్రమంలో తవ్వకాల్లో పురాతన ఆలయానికి ఉపయోగించిన పెద్దపెద్ద రాతి స్తంభాలు, శివలింగం, నాగసర్పం ఆకారంలో ఉన్న విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వుతున్న కొద్ది ఆలయానికి ఉపయోగించే శిల్పాలతో ఉన్న రాళ్లు బయల్పడ్డా యి.
వెంటనే జేసీబీ డ్రైవర్ అప్రమత్తమై విగ్రహాలను పక్కకు తీసుకొచ్చి భద్రపరిచాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, గొర్రెలకాపరులు తురకుల గుట్టకు తరలివచ్చి శివలింగం, నాగిని శిల్పం విగ్రహానికి పసు పు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజలు చేశారు. ఈ ఆలయం 10వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యులు నిర్మిం చినట్లుగా తెలుస్తోంది. తవ్వకాల్లో బయల్పడిన శివలింగానికి పానవట్టం లేదు. అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఇదే గ్రామ శివారులోని గుట్టలో లక్ష్మీనర్సింహస్వామి కొలువై ఉన్నాడు. తాజాగా ఈ గుట్టకు కొద్ది దూరంలో ఉండే తురకలగుట్ట వద్ద పురాతన శివాలయం ఆనవాళ్లు, శివలింగం, నాగిని విగ్రహం బ యటపడడం మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.