పోచమ్మమైదాన్, మార్చి 29 : వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతంలో మైనార్టీల కోసం ఆధునిక వసతులతో ప్రత్యేకంగా ఉర్దూ భవన్, షాదీఖాన నిర్మిస్తున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని 13వ డివిజన్ ఎల్బీ నగర్లో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఉర్దూ భవన్ షాదీఖానా భవన నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబాయ్ ఆర్కిటెక్ట్తో డిజైన్ వేయించి షాదీఖాన నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. ఇందులో అన్ని వసతులు ఏర్పాటు చేస్తారన్నారు. వెనుకబడిన ప్రాంతమైన ఎల్బీ నగర్లో గత పాలకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. పేదరికంలో ఉన్నవారు ఇంకా పేదరికంలో ఉండేటట్లు చేసి, వారు మాత్రం గొప్పగా తయారయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు.
కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నదని తెలిపారు. అలాగే వరంగల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పండుగలను అందరూ కలిసికట్టుగా జరుపుకుంటూ అనురాగబంధాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. తూర్పులో మాస్టర్ ప్లాన్ ప్రకారం ముంపు నివారణకు శాశ్వత నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. సమావేశంలో కార్పొరేటర్లు సురేష్కుమార్ జోషి, దిడ్డి కుమారస్వామి, ఉమా యాదవ్, నవీద్బాబా పాల్గొన్నారు. అలాగే 21వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు.
బీసీల సమస్యల పరిష్కారానికి కృషి..
కాశీబుగ్గ : బీసీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. మంగళవారం రాత్రి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా వెనుబడి ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనగిరి యాదగిరిగౌడ్, ప్రధాన కార్యదర్శి సంగ వెంకటరాజ్యం, జిల్లా అధ్యక్షుడు మూడెడ్ల సతీశ్, ప్రధాన కార్యదర్శి బెంబిరి యాదగిరి, ఉపాధ్యక్షుడు బేతి అశోక్బాబు, కోశాధికారి మామిడాల జగదీశ్, పిండి రాజేశ్యాదవ్ పాల్గొన్నారు.