నయీంనగర్, జనవరి 20: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్లో)లో రెండో రోజు శనివారం టెక్నోజియాన్-2024 జోరుగా సాగింది. విద్యార్థులు ఎగ్జిబిట్లతో తమ ప్రతిభ చాటారు. ట్రాక్పై ఉన్న డేంజర్ బాల్స్కు తగలకుండా ఎక్స్వై అనే యాప్ ద్వారా సెల్ లేదా రిమోట్తో నడిపే ‘వైఫై కంట్రోల్ కార్’, జాయ్స్టిక్ ద్వారా కంట్రోల్ చేస్తూ మోటర్స్ తిరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్న సర్కిల్లో బాల్ వేసే ‘పింక్పాంక్ లాంచర్’, సెల్ఫోన్లో తీసుకున్న ఫొటోను యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జీకోడ్ రూపంలో మార్చి యంత్రమే బొమ్మ గీసే ‘పిక్సల్ టూ పొట్రెట్ ప్రింటరింగ్’, లైట్ ఎటు కదిపితే అటువైపు సెన్సర్ ద్వారా కారు పోయే ‘ఫొటో అండ్ ట్రేస్’, సుత్తితో సెన్సర్ మధ్యలో కొడితే ఎంత బలంగా కొట్టామో ల్యాప్టాప్లో చూపే ‘పీజో పవర్ అక్రెట్’, గుట్టలు, కొండల్లో నడిపేందుకు వీలుగా డీజిల్తో నడిచేలా 25 మంది విద్యార్థులు రూ.10లక్షల ఖర్చుతో ఆరు నెలలు కష్టపడి తయారు చేసిన ‘ఆల్ టెర్నన్ వాహనం’ ఎగ్జిబిట్లు ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా, నిట్లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంట్రల్లో నిర్వహించిన కార్యక్రమానికి రెడ్ బస్ సీఈవో ప్రకాశ్ సంగం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్ బస్ సంస్థను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయని, వాటిని చాలెంజ్గా తీసుకుని జీవితంలో ఎదగాలని సూచించారు. రెడ్బస్ విశిష్టత గురించి వివరించారు. ఫ్యాకల్టీ అడ్వైజర్ హరిప్రసాద్రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసచారి పాల్గొన్నారు.