వర్ధన్నపేట, అక్టోబర్ 21: ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సర్పంచ్లు, ఎంపీటీసీలు శాఖల వారీగా సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన చర్చ జరిపేందుకు ఎంపీపీ అనుమతి రాగానే ఆ శాఖకు సంబంధించిన అధికారులెవరూ హాజరు కాకపోవడంతో సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామాల్లో గుడుంబా, బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండల సభలో ఈ విషయంపై చర్చిస్తున్నా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇల్లంద గ్రామంలో గుడుంబా తాగి అనేక మంది మృత్యువాత పడుతున్నారని చెబుతూ ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ గుడుంబాను తీసుకొచ్చి సభలో సభ్యులు, అధికారులకు చూపించారు. ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గ్రామాల్లో గుడుంబా విక్రయాలను అరికట్టాలని కోరారు. అలాగే, ఎక్సైజ్ అధికారులు మండల సభకు ఏమాత్రం జవాబుదారీతనంగా ఉండడం లేదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖలో ఉన్న పలు సమస్యలను సభ్యులు సభలో చర్చించి దశల వారీగా పరిష్కరించాలని కోరారు. అలాగే, పలువురు రైతులు భూములు విక్రయించినా వారికే రైతుబంధు సాయం అందుతున్నదని చెన్నారం సర్పంచ్ భాస్కర్రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. భూమి అమ్మి రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయగానే భూమిని విక్రయించిన రైతుకు రైతుబంధు సాయం రాకుండా ఉండేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీపీ, సభ్యులు డీటీ పవన్కుమార్కు సూచించారు. అలాగే, వ్యవసాయశాఖ, ఐసీడీఎస్, ఉద్యాన, నీటిపారుదల శాఖపై సభ్యులు సమగ్రంగా చర్చించారు. గ్రామాల వారీగా సర్పంచ్లు సభలో వివరించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఆ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఎంపీపీ సూచించారు. అంతేకాకుండా సభ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని ఎంపీపీ అప్పారావు హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.