రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి పట్టిన వీరుడతను. దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు. రఘునాథపల్లి మండం ఖిలాషాపూర్ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశాడు. అతడే బహుజన వీరుడు సర్వాయి పాపన్న. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
– రఘునాథపల్లి, ఏప్రిల్ 1
పాపన్న 1650 ఆగస్టు 18న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మృతిచెందగా తల్లి సర్వమ్మ అన్నీతానై పెంచింది. పాపన్న కల్లుగీత వృత్తిని కొనసాగిస్తూ యుక్త వయస్సులో భూస్వాములు, దేశ్ముఖ్ల దాష్టీకాలను ఎదిరించి పోరుబాట పట్టాడు. కాకతీయుల పాలన ముగిసిన 300 ఏళ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తున్నది. కుందేలు కుక్కను తరిమిన చోటుగా చరిత్ర గాంచింది. 18వ శతాబ్దంలో ఢిల్లీ సామ్రాజ్యాధిపతులైన మహ్మదీయ ప్రభువులతో పోరాడడంతో పాటు నిజాం నిరంకుశవాదుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈ గొప్ప ప్రాంతం పర్యాటక కేంద్రంగా ఉంది.
ఈ కోటకు నాలుగు వైపులా బురుజులున్నాయి. మధ్యలో ఎత్తైన మరో బురుజు ఉంది. ఒక బురుజు నుంచి మరో బురుజు వైపు నడిచి వెళ్లేందుకు సరిపడా వెడల్పైన స్థలం ఉంది. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోట గోడపై పిట్ట గోడలకు అనువైన రంధ్రాలు ఉండడంతో పాటు ఈ కోట నుంచి బయటకు వెళ్లేందుకు మూడు సొరంగాలున్నాయి. ఒక్కటి కోట మధ్యభాగం నుంచి బయట ఉన్న మంచినీటి బావికి వెళ్తుంది. మరొకటి బురుజుపై నుంచి కోట మధ్యభాగానికి, మూడోది తాటికొండ కోటకు మార్గం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఉత్తరం వైపు నాంచారి బావి ఉన్నట్లు తెలుస్తున్నది.
అంతర్జాతీయంగా పాపన్న ఖ్యాతి
పాపన్న అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు. సర్దార్ చరిత్రను ఆంగ్లేయ కవి జే.యే.బోయేల్ ఇండియన్ అంటిక్వెరి పత్రికలో 1874లోనే రాశారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారు. చరిత్రను పరిశోధించి తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ దివంగత ఆచార్య పేర్వారం జగన్నాథం, పీహెచ్డీ తీసుకుని పాపన్న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపురానికి చెందినవాడని రుజువు చేశారు. ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర్శర్మ, ఆదిరాజు వీరభద్రరావు, చోల్లేటి నృసింహశర్మ రామరాజులు పాపన్న చరిత్రను వెలుగులోకి తెచ్చారు.
బీఆర్ఎస్ హయాంలోనే కోటకు గుర్తింపు
ఘన చరిత్ర కలిగిన కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఉమ్మడి రాష్ట్రంలో మాట ఇచ్చిన ఇదే గ్రామానికి చెందిన అప్పటి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. కానీ స్వరాష్ట్రంలో వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే తపనతో సీఎం కేసీఆర్ పాపన్న కోట అభివృద్ధికి రూ.కోటి మంజూరుచేశారు. వీటితో గోడలకు ప్యాచ్వర్క్ చేశారు. అకాల వర్షంతతో కోటగోట ఒక పక్క కూలడంతో మంత్రి శ్రీని వాస్ గౌడ్ మరమ్మతులు చేయించారు. ఇండ్లు కోల్పో యిన వారికి ప్రభుత్వమే నిర్మించింది. పాపన్న 376వ వర్ధంతి వేడుకలను గౌడకులస్తులు రాష్ట్ర వ్యా ప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఖిలాషా పురం లోని పాపన్న కోటతో పాటు గ్రామ బస్టాండ్లోని పాపన్న విగ్రహం వద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.