వరంగల్, ఏప్రిల్ 1 : గ్రేటర్ వరంగల్పై దోమలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తలుపు తీస్తే ఇళ్ల లోపలకొచ్చేస్తున్న దోమలతో నగర వాసులు రాత్రంతా యుద్ధం చేస్తున్నారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారికి కూడా వీటి కాటు తప్పడం లేదు. బల్దియాలో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా తయారు కావడంతో డ్రైనేజీలు నిండిపోయి వీధుల్లో మురుగు నీరు పారుతున్నది. వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. వేసవిలో దోమల బెడద ఇంతలా ఉండడమేంటని నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
నెల రోజులుగా ప్రజారోగ్య విభాగం అధికారులు, ఉద్యోగులు తమ పనిని గాలికి వదిలి పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు పర్యవేక్షించే అధికారులు కరువయ్యారు. దీంతో డ్రైనేజీలు నిండిపోగా, ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఎంఎల్వో ఆయిల్ స్ప్రే, ఫాగింగ్ చేసే అర్బన్ మలేరియా సిబ్బంది పనితీరుపై నిఘా లేకపోవడంతో నగరం దోమల బారిన పడుతుండగా, ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నాసిరకం కెమికల్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నగర ప్రజలకు దోమల బెడద తప్పడం లేదు. దోమల నివారణ కోసం గ్రేటర్ అధికారులు టిమోపాస్, డెల్టా మెత్రిన్, ఎంఎల్వో ఆయిల్ వినియోగిస్తున్నారు. అయిప్పటికీ దోమల నియంత్రణ సాధ్యం కావడం లేదు. రూ. లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గ్రేటర్ అధికారులు దోమల నివారణకు నాణ్యమైన కెమికల్స్ను వినియోగించాలనే డిమాండ్లు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో ఇంటింటి చెత్త సేకరణపైనే దృష్టిసారించిన అధికారులు డ్రైనేజీలను శుభ్రం చేయించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురుగు నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి. వారం రోజులకు ఒకసారి శుభ్రం చేయాల్సిన డ్రైనేజీలను నెల రోజులైనా పట్టించుకోకపోవడంతో దోమలకు అవాసాలుగా మారుతుండడంతో అవి నగరమంతా స్వైర విహారం చేస్తున్నాయి. దోమల మందు స్ప్రే, ఫాగింగ్ చేసే అర్బన్ మలేరియా విభాగం సిబ్బందిపై పర్యవేక్షణ కరువైంది. బయాలాజిస్ట్ లేకపోవడంతో సీఎంహెచ్వోనే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బల్దియాలోనే ఒక్కో డివిజన్కు రెండు హ్యాండ్ ఫాగింగ్ మిషన్లతో పాటు హనుమకొండ, వరంగల్లో 4 చొప్పున పెద్ద ఫాగింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అయినా దోమలు నగర ప్రజలపై యథేచ్ఛగా దాడి చేస్తూనే ఉన్నాయి.
గ్రేటర్ వరంగల్ పరిధిలో దోమలు పెరిగిన మాట వాస్తవమే. వాటి నివారణ కోసం ప్రత్యేకంగా 10 రోజుల కార్యాచరణ రూపొందించాం. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇవే కెమికల్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న కెమికల్ మోతాదును పెంచి డ్రైనేజీల్లో పిచికారి చేసి దోమల లార్వా చనిపోయేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎంఎల్వో ఆయిల్ స్ప్రే చేస్తాం. మురుగు నీటిలోనే కాకుండా మంచి నీరు నిల్వ ఉన్నా దోమలు తయారవుతాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
-డాక్టర్ రాజారెడ్డి, సీఎంహెచ్వో, జీడబ్ల్యూఎంసీ